ఎన్నడూ లేనిది టీటీడీ కొత్త పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను 50 కి పైగా ఉంచడంతో పలు విమర్శలు రేగాయి. ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుపై వివాదాలూ రేగాయి. కానీ జగన్ అవన్నీ పట్టించుకోకుండా జీఓ జారీ చేశారు. అంతమందిని నియమించడంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం కష్టం అవుతుందన్న మాటను వైదిక సంస్థలూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కాస్తయినా దిగది వస్తారని భావించారు కానీ తాను అనుకున్న విధంగా అతి పెద్ద పాలక మండలి ఏర్పాటు చేసి అయిన వారికి, పారిశ్రామిక వేత్తల సన్నిహితులకు స్వామి కొలువులో చోటు ఇచ్చి స్వకార్యం నెరవేర్చుకున్నారు. దీనిపై రెబల్ ఎంపీ ఆర్ ఆర్ ఆర్ కూడా సీరియస్ అయ్యారు.
టీటీడీ వివాదంలో కోర్టు మళ్లీ జగన్ ను విస్తుబోయేలా చేసింది. ప్రత్యేక ఆహ్వానితులపై బీజేపీ చేస్తున్న రగడ, మరోవైపు న్యాయస్థా నాన్ని కొందరు ఆశ్రయించడంతో ఈ తగువు కాస్త తీవ్రం అయింది. దీంతో ఇవాళ కోర్టు ప్రత్యేక ఆహ్వానితులపై విడుదలయిన జీఓను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మొదట్నుంచి ఇంత పెద్ద పాలకమండి ఎందుకు అన్న ప్రశ్నలు రేగుతున్నాయి. గతంలో లేని విధంగా ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను పెంచుకుని పోవడంతో బీజేపీ సైతం మండిపడింది. టీటీడీ ఆహ్వానితుల సంఖ్యను పెంచుకుని పోవడంలో ఆంతర్యం ఏంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. అదేవిధంగా దీనిపైనే కోర్టులో ముగ్గురు సామాన్య భక్తులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.