ఇదంతా పదేళ్ల కిందట మాట. ఆ తరువాత ఎన్నికలే లేవు :
రాజకీయంలో ఏదీ శాశ్వతం కాదు. ఏదీ గొప్పది కాదు. అది రాజకీయాన్ని దాటిపోదు. రాజకీయాలను మలుపు తిప్పే శక్తులను మనం అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంది. వీటిలో మున్సిపల్ రాజకీయాలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉంటాయి. తాము అనుకున్నవి నెగ్గించుకుని, స్థానిక బాటలో నడిచి, పోరులో గెలిచి మంచి పేరు తెచ్చుకుని తమని తాము నిరూపించుకుని తీరాలన్న పంతం, పట్టింపు అన్నవి రాజకీయ నాయకుల్లో మెండు. ఈనేపథ్యంలో వారంతా అనుచర వర్గంను మరింతగా ప్రోత్సహిస్తుంటారు. శ్రీకాకుళం స్థానిక రాజకీయాలకు సంబంధించి ముందు నుంచి ఎర్రన్నాయడి ప్రభావం బాగా నడిచేది. కొంత గుండ లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ ( తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు) ప్రభావం కూడా ఉంది. గత సారి కౌన్సిల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఇదంతా పదేళ్ల కిందట మాట. ఆ తరువాత ఎన్నికలే లేవు. మెంటాడ పద్మావతి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.
అంతకుమునుపు పైడిశెట్టి జయంతి (తెలుగుదేశం తరఫున గెలిచారు) చైర్ పర్సన్ గా పనిచేశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలూ మున్సిల్ కౌన్సిల్ ను బాగా నడిపినప్పటి కీ వీరిద్దరికీ వర్గ పోరు తప్పలేదు. పైడిశెట్టి జయంతి నాన్న అంధవరపు వరం కూడా మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం, ఎర్రన్న ప్రోత్సాహం ఈ కుటుంబానికి ఉండడంతో అ ప్పట్లో వరం మాటకు ఎదురు లేదు అన్న విధంగా ఉండేది. తరువాత పద్మావతి కౌన్సిల్ లో వరం కొందరిని తనకు అనుకూలంగా మలుచుకుని రాజకీయం నడిపి, ఆమె క న్నీళ్లు పెట్టుకోవడానికి కారణం అయ్యారు. ఇటీవలే వరం కన్నుమూశారు. జయంతి మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ధర్మాన నాయకత్వంలో ఆమె పని చే సేందుకు సిద్ధం అవుతున్నారు.
అదేవిధంగా పద్మావతి నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్సార్సీపీ వరకూ ధర్మాన నాయకత్వంలోనే పనిచేస్తూ రాజకీయ రంగంలో ఉండిపోయారు. ఇప్పుడు వీరి కుమారుడు మెంటాడ వెంకట స్వరూప్ శ్రీకాకుళం జిల్లా విద్యార్థి విభాగానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన కూడా స్థానిక రాజకీయాలపై మంచి పట్టు పెంచుకున్నారు. తల్లికి తగ్గ తనయుడు. సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. తాజాగా విలీనం అన్నది షురూ కావడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఏడు పంచాయతీల విలీనంపై ఓ స్పష్టత రావడంతో శివారు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పరిపూర్ణ అభివృద్ధి తమకు దక్కుతుందన్న ఆనందం వారిది. ఇక ఎన్నికలే మిగిలాయి. కోర్టు తగాదాలు వీటిపై కూడా ఉన్నాయి. వాటిని క్లియర్ చేసేందుకు కొన్ని రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వినికిడి.