ఇలా.. అధిష్టానం నుంచి సందేశం అందుకున్న ఎమ్మెల్యేల్లో.. విజయనగరం జిల్లా ఎస్. కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.. ముందువరుసలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీకి సంబంధించి ఒక సమస్య ఉంటే.. ఇక్కడ మరో సమస్య వస్తోంది. జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు నెలకొంది. పార్టీలో దగుల్బాజీలు తయారయ్యారంటూ ఓ వర్గం దేవిబొమ్మ కూడలిలో ఆందోళనకు దిగింది. కష్టపడి పని చేసే కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు గుర్తింపు లేదని నిరసన చేపట్టింది. ఇదే పరిస్ధితి కొనసాగితే పార్టీకి దిక్కుండదని విమర్శలు గుప్పించింది.
దీనికి కారణం.. పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ స్థానాలను ఈ నియోజకవర్గంలో తన వర్గానికి కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే రెడీ కావడమేనని ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా నాలుగు మండలాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. నాయకులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..రిలే నిరాహార దీక్షలకు కూడా దిగారు. ఎంపీపీ స్ధానాలు అనర్హులకు కట్టబెడుతున్నారని నాలుగు మండలాల్లో కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. శృంగవరపుకోటలో తిరుగుబాటుదారుల నిరసన గడిచిన నాలుగు రోజులుగా సాగుతోంది. కొత్తవలసలో వైసీపీకి చెందిన 17 మంది ఎంపీటీసీల్లో 14 మంది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారిపోయారు.
అంతేకాదు.. గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు.. తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రహస్య శిబిరం నిర్వహిస్తున్నారు. పార్టీ సమన్వయకర్త చిన్న శ్రీను బుజ్జగించినా తిరుగుబాటుదారులు ససేమిరా అంటున్నారు. ఈ పరిణామాన్ని పార్టీ అధిష్టానం.. సీరియస్గా తీసుకుంది. తక్షణం ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దాలని ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు సందేశం పంపింది. అంతేకాదు.. మీరు చక్కదిద్దక పోతే.. మేమే జోక్యం చేసుకుంటామని కూడా పేర్కొంది. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండురోజుల్లో ఎంపీపీ ఎన్నిక ఉండడంతో ఈ నియోజకవర్గం పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.