అధికార పార్టీ వైసీపీ నేతలకు పెద్ద బెంగే పట్టుకుంది. త్వరలోనే రాష్ట్రంలో పార్టీ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ బృందం అడుగు పెట్టనుందని.. పార్టీ పెద్దల నుంచి సమాచారం వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ప్రశాంత్ కిశోర్.. తన పని ప్రారంభిస్తారని అంటున్నారు. అయితే.. ఈ ప్రయత్నం మంచిదే కదా..? ప్రశాంత్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటి? లోపాలు ఎలా ఉన్నాయి? ఏం చేయాలి.. టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? వంటి అనేక విషయాలను ప్రజల నుంచి సేకరించి.. పార్టీకి అందిస్తుంది. తద్వారా .. పార్టీ మెరుగైన ఫలితం కోసం.. ఎలా ముందుకు సాగాలో నిర్ణయిస్తుంది.
మరి ఇది పార్టీకి.. నేతలకు కూడా మంచి పరిణామమే కదా..! ఎవరో ఒకరు పార్టీ గురించి.. సర్వే చేయాల్సిందే కదా.. దీనికి పార్టీ నేతల్లో గుబులు.. దిగులు.. ఎందుకు? అనేది ప్రశ్న. అయినప్పటికీ.. పార్టీ నేతలు హడిలి పోతున్నారనే అంటున్నారు పరిశీలకులు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. గత అనుభవా లు.. రెండు.. భవిష్యత్తుపై ఆశలు లేకపోవడం! ఒకింత ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. నిజమనే అంటున్నారు పరిశీలకులు. గత 2019 ఎన్నికలకు ముందు కూడా పీకే టీం రాష్ట్రంలో పర్యటించింది. అయితే.. ఈ పీకే టీంకు రోజు వారీ అయ్యే ఖర్చులను సదరు నియోజకవర్గ బాధ్యులు పెట్టుకోవాలని పార్టీ నుంచి ఆదేశం వచ్చింది.
దీంతో పీకే బృందానికి లగ్జరీ హోటళ్లలో బస సహా.. ఇతర త్రా ఖర్చులు.. వాహనాలు.. వంటివి.. నేతలకు తడిసిపోపెడయ్యాయి. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక.. ఈ ఖర్చు రెట్టింపు అయినా.. ఆశ్చర్యం లేదు. అంతేకాదు.. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కనుక.. మరింతగా ఖర్చు పెట్టించే ఛాన్స్ కూడా కనిపిస్తోందని అంటున్నారు. ఇది ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇబ్బందిగా మారింది. కేంద్రం నుంచి ఎంపీ లాడ్స్ నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారు. వెరసి..ఇ ప్పుడు పీకే టీం వస్తోందంటేనే హడలి పోతున్నారు.
మరోకారణం.. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. అయితే.. చాలా నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు జరగడం లేదు. ఓవరాల్గా చూసుకుంటే.. సీఎంగా జగన్కు మంచిమార్కులు పడినా.. నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఇబ్బందిగా మారిందనేది.. నేతల మాట. దీంతో.. వారు కూడా పీకే టీ వస్తోందంటే.. ఇబ్బందిగానే ఫీలవుతున్నారు. ఏం జరుగుతుందో.. ఎలాంటి రిపోర్టు ఇస్తారో.. ఇది చూసి.. తమకు జగన్ టికెట్ కేటాయిస్తారో.. లేదో..అనే చర్చ జోరుగాసాగుతుండడం గమనార్హం. అయితే. ఎవరూ కూడా రోడ్డున పడడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.