ఎప్పుడు అంతరంగిక కుమ్ములాటలతో, గొడవలతో అధికార పార్టీకి అవకాశం ఇస్తూ ప్రజల్లో చులకనవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పార్టీకి తిరుగుండదనుకున్నారు. కానీ, దానికి వ్యతిరేకంగా పార్టీ నామా రూపాల్లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పడిన తరువాత టీపీసీసీ ప్రెసిడెంట్గా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలేదు.
ఇప్పుడు, టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. జీవంలేని పార్టీకి కొత్త ఉత్తేజం తెచ్చి ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డికి సీనియర్లు తగిన రీతిలో సపోర్ట్ చేయడం లేదని బహిరంగంగానే కనిపిస్తోంది. అయినా సరే సీనియర్ల ఇంటికి వెళ్లి వాళ్లకు కలుపుకుని ముందకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. అయినా, కొందరు సీనియర్ నాయకులు టీపీసీసీ పదవి పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సీనియర్ల సహకారం లేకపోవడం పార్టీలో ఇష్టారాజ్యం ఉండడంతో పార్టీ పరువు కాస్త పోయింది. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి పై చేసిన వాఖ్యలతో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మారరా అని ప్రజలు చీదరించుకుంటున్న విషయం బహిరంగాగానే అందరికి తెలిసిన విషయం. కాంగ్రెస్లో ఓ వ్యక్తి హీరోయిజం నడవదంటూ.. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీంతో మరో సారి కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయంటున్నారు రాజకీయా వర్గాలు.