నిజానికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనే.. రెండున్నర ఏళ్ల తర్వాత తన మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ గడువు సమీపిస్తోంది. అయితే ఇప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు అధికార వైసీపీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట మేరకు తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న నేపథ్యంలో తాజాగా బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఓ వర్గం మరో ఏడాది వరకు మంత్రివర్గ విస్తరణ ఉండబోదు అని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో నవంబరు- డిసెంబరులో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది లాంటి చర్చ మళ్లీ జోరందుకుంటోంది. అంతేకాదు మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల చేసిన విదేశీ ప్రయాణం అంశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించి గొడవ జరుగుతుంటే.. మంత్రి బాలినేని విదేశీ పర్యటనలు చేయడం ఏమిటి? ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాలినేనిని క్యాబినెట్ నుంచి తొలగించడం దాదాపు ఖాయమై పోయిందా? ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు ముఖ్యమంత్రి వైపు నుంచి సమాచారం వచ్చిందా? అందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ కూడా జరుగుతోంది.