జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి నారాయణపేట జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు కలిసి ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. అలాగే మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలందరూ ఏకతాటిపైనే ఉన్నారని తెలుస్తోంది. కానీ జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో మాత్రం భిన్న పరిస్థితులు ఉన్నాయి.
ఈనెల 2న పార్టీ జెండా పండుగతో నూతనంగా పార్టీ కమిటీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటికే గ్రామ, వార్డు, అనుబంధ కమిటీల ఎన్నిక పూర్తయింది. ఈనెల 20 వరకు మండల, పట్టణ కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసి.. నెలాఖరులో జిల్లా అధ్యక్షులను ఎన్నుకోనున్నారు. తర్వాత పార్టీ జిల్లా కమిటీలు రూపుదిద్దుకోనున్నాయి.
జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా కమిటీ ఎన్నికపై మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో ఆ పార్టీ నేతలందరూ ఏకతాటిపై ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ రెండు జిల్లాలను లీడ్ చేస్తున్నారు. మహబూబ్నగర్కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ముఖ్య నేతలు సమష్టి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నారాయణపేటకు జిల్లాలో ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి సైతం మంత్రితో కలిసి అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వనపర్తి జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వర్గ విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.