హుజురాబాద్లో ఈటల వైపు ఉన్న దళితులను దళిత బంధుతో తన వైపు తిప్పుకున్నారు సీఎం కేసీఆర్. అలాగే అక్కడి నేతలకు చాలా వరకు పదవులు ఇచ్చారు. దీంతో పాటు కాంట్రాక్టులు కూడా ఇచ్చి తన వైపు లాగేసుకున్నారు. మిగిలిన ఈటల వర్గంలో చాలా వరకు కోవర్టులు ఉన్నారన్నది అంచనా. మొన్న ఈటల గడియారం పంచితే ముందుగా ఆ వీడియో టీఆర్ఎస్ పార్టీకి చేరిపోయిందట, అలాగే ఈటల భావమరిది వాట్సాప్ చాట్ విషయంలో రచ్చ రచ్చ చేశారు. ఇంకా ఈటలకు చేసిన పాలాభిషేకం కూడా వైరలయింది. ఈటల ఏ అడుగు ఎటు వేసినా తెలిసిపోతుందటా. దీంతో తనవారేవరో కాదో నని ఈటల తల పట్టుకుంటున్నారట.
అలాగే, ఈటలకు ఓటు వేసి గెలిపిస్తే హుజురాబాద్ అభివృద్ది కాకుండా చూస్తామని బెదిరిస్తున్నట్టు సమాచారం. దీంతో కొందరు తటస్తులు మనకెందుకులే అని పట్టించుకోవడం మానేశారట. ఈ నేపథ్యంలో దళితులకు డబ్బులు ఇస్తే ఇతర కులాల వారు సైలెంట్గా కూర్చోరు కాబట్టి వారికి అందించాల్సిన డబ్బులు తెరవెనుకే పంచేస్తున్నారని సమాచారం. ఈ పంపిణీ అక్కడక్కడ కొంత ఉండడం, ఈటలకు ఉన్న ఇమేజ్ తగ్గిపోవడం కోసమే ఉప ఎన్నికకు గడువుకు కోరినట్టు తెలుస్తోంది. ఈ లోపు ప్రజల మైండ్ సెట్ మార్చి ఈటలకు వారిని దూరం చేయడం కోసమే ఉప ఎన్నిక వాయిదా వేసినట్టు కనిపిస్తోంది.