ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తొలిసారి వ్య‌తిరేకంగా మాట్లాడారు. వాస్త‌వానికి ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డేందుకు తాము అనేక య‌జ్ఞాలు, యాగాలుచేశామ‌ని చెప్పిన స్వ‌రూపానందేంద్ర‌.. ఇప్ప‌టివ‌ర‌కు మౌనంగానే ఉన్నారు. అనేక ఘ‌ట‌న‌లు జ‌రిగినా.. అన్ని వ‌ర్గాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. ఎప్పుడూ స్పందించ‌లేదు. అంతేకాదు.. రాష్ట్రంలో ఆల‌యాల‌పై దాడులు జ‌రిగినా మౌనంగానే ఉన్నారు. ప‌క్క‌నే ఉన్న విజ‌య‌న‌గ‌రంలోని రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం శిర‌స్సును దుండ‌గులు చేధించినా స్పందించ‌లేదు. ప‌రిణామాల‌న్నీ మౌనంగానే ప‌రికించి.. ఇప్పుడు మాత్రం హ‌ఠాత్తుగా జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు.

కార‌ణ‌మేంటంటే..!
ప్ర‌స్తుతం ఏకీకృతంగా ఉన్న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను బీసీ సంక్షేమ శాఖ‌లో క‌ల‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో స్వామివారికి కోపం వ‌చ్చింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెనుకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో వెల్ల‌డించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ఏపీ ప్ర‌భుత్వానికి ప్రతిపాదిస్తోంది. సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలోకి కలపాలని చూస్తే పోరాటం చేస్తామని పీఠం హెచ్చరిస్తోంది.

వీరిద్ద‌రికీ ఏమైంది?
ప‌లు విష‌యాల్లో జ‌గ‌న్ ముందుగానే స్వామితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఆఖ‌రుకు మంత్రి వ‌ర్గ ఏర్పాటులోనూ స్వ‌రూపానంద సూచ‌న‌ల‌ను పాటించార‌ని గుస‌గుస‌లు వ‌చ్చాయి. అయితే ఈమ‌ధ్య కాలంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో స్వామికి స‌మాచారం లేద‌ని, దీనిపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారంటున్నారు. అందుకే ఇప్పుడు హ‌ఠాత్తుగా త‌న‌ను తాను గుర్తు చేసుకునే ప‌నిలో భాగంగానే ఇలా హెచ్చ‌రిక‌లు జారీచేసి ఉంటార‌ని భావిస్తున్నారు.  కొన్నాళ్ల కింద‌ట కూడా స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ప్ర‌యాణం పెట్టుకుని స్వ‌రూపానంద‌ను క‌లిశారు. అప్ప‌టి వ‌ర‌కు బానే ఉన్న వీరి సంబంధాలు బెడిసి కొట్టాయంటున్నారు. వీటిల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్దికాలం వేచిచూడ‌క త‌ప్ప‌దు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: