ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. న్నారా? అందులో భాగంగానే తనకు తలనొప్పిగా మారిన భారతీయ జనతాపార్టీతో దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కమలానికి ఫ్యాన్ గాలి తగలదా? అనే ప్రశ్నలకు రాజకీయ వర్గాలు ఔనంటున్నాయి. రాజకీయాల్లో రాటు దేలిన జగన్ వచ్చే ఎన్నికల కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బీజేపీని దూరం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీకి సహకరిస్తోన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తన పంథాను మార్చుకుంటున్నారు.
దూరం జరుగుతూ వస్తోన్న జగన్
గత రెండున్నరేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కారుకు జగన్ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లో ఏ బిల్లు పెట్టినా సమర్థించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీయేకి మద్దతునిచ్చింది. కానీ ఇప్పుడు జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆయన కేంద్రంతో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో వైఫల్యం, ఇంధన ధరలను కట్టడి చేయలేకపోవడం, రైతు చట్టాలపై మొండి వైఖరి, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తుండడం ఇలా వివిధ కారణాలతో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం మొండిగా ముందుకే వెళుతోంది. దీంతో బీజేపీతో సన్నిహితంగా ఉంటే ఆ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలేదనే ముద్ర జగన్పై పడి ఎన్నికల్లో తేడా కొట్టిద్దని భావిస్తున్నారు.
జగన్కు తలనొప్పిగా మారిన బీజేపీ నేతలు
ఇక రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా ముఖ్యమంత్రికి తలనొప్పిగా తయారయ్యారు. వినాయక చవితి ఉత్సవాలు, టిప్పు సుల్తాన్ విగ్రహం, తితిదే బోర్డు నియామకం.. ఇలా మత విషయాల్లో తన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుండడం జగన్కు, జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. తాము బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని బలహీనతగా భావిస్తున్నారని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పూర్తిస్థాయిలో బీజేపీని దూరం పెట్టాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖ సమావేశానికి జగన్ వెళ్లకపోవడానికి అదే కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పిలుపిచ్చిన భారత్ బంద్కు జగన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం కూడా అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.