మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మావోయిస్టులకు నిధులు అందకుండా చూడండని నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలకు సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో మావోయిస్టులనుకట్టడి చేసేందుకు కూంబింగ్ ను ముమ్మరం చేయాలన్నారు ఆయన. హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన  ఉన్నతస్థాయి సమావేశంలో నక్సల్స్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం 23 శాతం తగ్గగా మరణాల సంఖ్య 21 శాతం తగ్గిందన్నారు అమిత్ షా. ప్రస్తుతం 53 జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రభావం  ఉందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

కేంద్ర బలగాల కోసం రాష్ట్రాలు భరించే ఖర్చును ప్రధాని తగ్గించారని   ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాలపై రెండు వేల తొమ్మిది వందల కోట్ల భారం తగ్గిందన్నారు అమిత్ షా. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వం వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో  అభివృద్ధి కార్యక్రమాలపై అమిత్ షా ఆరా తీశారు.రహదారులు, వంతెనలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వంటి వాటి గురించి సీఎం లను అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాల్లోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఏకలవ్య పాఠశాలలు, పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని వివరించారు. మావోయిస్టు సమస్యను అధిగమించడం ద్వారానే ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు అమిత్ షా.

అలాగే నక్సల్స్  కు సంబంధించిన కేసుల విచారణ సహకారం నిఘా విభాగాలు, ప్రత్యేక బలగాల సామర్థ్యం పెంపు  సహా కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగు పరచడం వంటి అంశాల పైనఈ భేటీలో చర్చించారు.తమ రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి తగ్గుతోందని ప్రస్తుతం నక్సల్స్ 3 జిల్లాలకు పరిమితమయ్యారని హోం మంత్రికి తెలిపారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. మొత్తానికి మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మావోయిస్టులకు సాయం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడంతోపాటు, భద్రతా పరమైన లోపాలను నిరోధించాలనే అంశాలపై చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: