ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నియామకాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నంతవరకే చేశామని కేటీఆర్ తెలిపారు. అంటే ఐదు శాతం కన్నా ఎవరు ఉద్యోగాలు సృష్టించలేరని ఆయన అన్నారు. ఇక తాజా ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాల గురించి రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇందిరారెడ్డి మాట్లాడుతూ, ఆ నియామకాలు కోర్టు పరిధిలోకి వెళ్లినట్టు చెప్పారు. కోర్టు చెప్పినన్ని, చెప్పిన విధంగా ఆయా నియామకాలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. 1991 నుండే ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాలు నిలిపివేసినట్టు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో కేసులు నడుస్తున్నందున ఆయా నియామకాలు తీర్పు వచ్చే వరకు చేయలేమని చెప్పారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటు చేయబడిన అనేక అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35573 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నట్టు రాథోడ్ తెలిపారు. ఇటీవలే అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచామని, అలాగే మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాలు కూడా పెంచేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు రాథోడ్ చెప్పరు. రాష్ట్రంలో నియామకాలు జరగకపోవటంతో అనేక మంది ఇప్పటికే ఆత్మత్యాగాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కరోనా సమయంలో పలు సంస్థలు ఉన్న ఉద్యోగులను కూడా తగ్గించుకోవడంతో నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోయిందని పలు నివేదికలు వెల్లడించాయి.