వేరుశనగా రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంట దెబ్బతిన్న రైతులను కనీసం స్థానిక నేతలు పరామర్శించలేదు అని ఆరోపణలు చేసారు. రైతులు ప్రభుత్వాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు- టీడీపీ హయాంలో రైతన్నలను ఆదుకున్నాం అని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. రాయలసీమ వేరుశనగ రైతులను ఆదుకోలేని ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉండటానికి అనర్హుడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తన ప్రాంత రైతులకు న్యాయం చేయలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటేఎంత...లేకపోతే ఎంత? అని నిలదీశారు. ప్రకృతి శాపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు కన్నీరే మిగిలింది అని ఆరోపించారు. గతేడాది 12 లక్షల 20 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసిన రైతులు రూ.3వేల కోట్ల విలువైన పంటను నష్టపోయారు అని ఆవేదన వ్యక్తం చేసారు. అంత తీవ్రంగా నష్టం జరిగితే జగన్ ప్రభుత్వం రైతులకు కనీసం రూ.300 కోట్లు కూడా పరిహారం ఇవ్వలేదు అని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడంతో వేరుశనగ రైతులు అప్పుల పాలయ్యారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు తగ్గింది అని ఆయన తెలిపారు.