గత ఎన్నికల్లో వైసీపీ వేవ్లో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డి.. ప్రజల కంటే కూడా సొంత వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చలు అయితే నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. గతంలో కందికుంట హయాంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ప్రజలకు ఆయన చేరువయ్యారు. ఇక, 2014లో పార్టీ అధికారం లోకి వచ్చినా ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ.. ప్రజలకు అన్ని రూపాల్లోనూ ఆయన సేవ చేశారు. తనవ ద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన సాయం చేశారు.
2014లో గెలిచిన చాంద్ బాషా ఆ తర్వాత టీడీపీలోకి వచ్చినా కూడా నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కందికుంటే నియోజకవర్గ అభివృద్ధికి వెన్నుముకగా నిలిచారు. గత ఎన్నికలలో ఓడిపోయినా కూడా కందికుంట ప్రజల్లో ఉండడం మానలేదు. గెలిచినా ఓడినా నియోజకవర్గంలో ప్రజల మధ్యే ఉంటూ వస్తోన్న ఆయన వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఇప్పుడు ఆయనపై తిరుగులేని సానుభూతి పవనాలు వీస్తున్నాయి. దీనికి తోడు సిద్ధారెడ్డిపై ఉన్న అంచనాల్లో పది శాతం కూడా ఆయన అందుకోలేదు.
దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కందికుంటనే ఆశ్రయిస్తున్నారు. ప్రతి సమస్యనను ఆయన దృష్టికి తెస్తున్నారు. అయితే.. ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో వారికి చేయగలిగినంత సాయం చేస్తున్నారు. కొందరు వ్యాపారులతో మాట్లాడి .. స్వచ్ఛందంగా కూడా కొన్నిసేవలు చేయిస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తున్న ప్రజలు.. కందికుంట వైపు సానుభూతి చూపిస్తున్నారని.. అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా? అని కూడా ఎదురు చూస్తున్నారు.
ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సొంత పార్టీలోనే ఎగస్పార్టీ పెరిగిపోయింది. లెక్కకు మించిన నాయకుల ఆధిపత్యం పెరిగిపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అంతా వలంటీర్లే చూసుకుంటారంటూ.. తనవద్దకు వచ్చిన వారికి సమాధానం చెబుతున్నారు. దీంతో అతి తక్కువ సమయంలోనే ఆయనపై వ్యతిరేకత పెరగడం కందికుంటకు కలిసి వస్తున్న పరిణామంగా చెబుతున్నారు. మరి ఇవి ఎన్నికల నాటికి ఎలా ? మ మారతాయో ? చూడాలి.