కరోనా పరీక్షల్లో మంత్రి గంగులకు పాజిటివ్గా నిర్థారణ అయింది. వెంటనే హుటాహుటిన మంత్రి హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మధ్య కాలంలో తనను కలిసి వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఉండడంతో మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఎంతమందికి కరోనా వచ్చిందనేది సంచలనంగా మారింది. హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు, పలువురు టీఆర్ఎస్ నేతలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నాగార్జున సాగర్లో సీఎం కేసీఆర్ తో పాటు సాగర్ ఎమ్మెల్యే నోమల భగత్, పలువురు టీఆర్ఎస్ నాయకులకు కరోనా సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో కరోనా కలకలం సృష్టించిన విషయం విధితమే. హుజూరాబాద్లో కూడ అదేవిధంగా మారబోతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అనేది కాస్త స్థిరంగానే కొనసాగుతుంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన వివరాల ప్రకారం.. 44310 నమూనాలను పరిక్షించారు. అందులో నూతనంగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,68,266కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3933గా నమోదైంది. తెలంగాణలో మరణాల రేటు 0.58శాతంగా ఉన్నది. ఇదిలా ఉండగా ఇంకా మరో 1543 నమూనాలకు సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. గత 24 గంటల్లో తెలంగాణలో 201 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,60,143కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4190 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 98.78 శాతంగా ఉన్నది. రికవరీ ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదు అయింది.