2014వ సంవత్సరంలో విభజన తర్వాత జూన్ నాటికి ఏపీలో 22.5 మిలియన్లు విద్యుత్ లోటు ఉంది. అప్పట్లో పట్టణాల్లో ఎనిమిది గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోత అమలయ్యేది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంపై దృష్టి సారించింది. ఉత్పాదన పెంచుకోవడం, ట్రాన్సమిషన్ నష్టాలు తగ్గించుకోవడం, 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండే విధంగా చేయడం, వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించడం వంటి లక్ష్యాలతో టీడీపీ సర్కారు అప్పట్లో ప్రణాళికలు రూపొందించింది. వెంటనే లక్ష్యాలను కూడా చేరుకోగలిగింది. దీంతో అప్పుడు ఏపీలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా సాధ్యం అయింది.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంపై ముందుచూపు లేకుండా వ్యవహరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా సౌర పవన విద్యుత్ రంగాలపై అక్కసు పెంచుకుని ఎక్కువ ధరకు 25 సంవత్సరాలు పాటు ఒప్పందాలు కుదుర్చుకుని రాష్ట్రానికి ఆర్ధికంగా నష్టాలు కలిగించారని ఆరోపణలు తలెత్తాయి. పీపీఏలలో పెట్టుబడులు పెట్టిన జపాన్, జర్మనీ వంటి పలు దేశాలు, జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వానికి పీపీఏల జోలికి వెళ్లొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ మొండి పట్టుదలతో ముందుకు వెళ్లిన జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు తలబొప్పి కడుతోంది. మొత్తంమీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు పడకేశాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.