బయట మార్కెట్లో అధిక ధరలకు కొని డిస్కంలపై భారం మోపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. దీని కారణంగా మనకు సర్దుబాటు ఛార్జీలు అన్నవి తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు కుదేలయి ఉన్న వర్గాలకు విద్యుత్ బిల్లుల రూపంలో కష్టాలు పలకరిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు కోతలు షురూ కానున్నాయని తేలడంతో కొందరు కంటి మీద కునుకు అన్నది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఇవి సఫలీకృతం అయితేనే కోతల నుంచి ఉపశమనం లభించడం సులువు.
విద్యుత్ కు సంబంధించి జగన్ చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రా కన్నా తెలంగాణ ముందు చూపుతో ఉండడంతో సీఎం కేసీఆర్ అందరి నుంచి అభినందనలు అందుకుంటున్నారు. కానీ ఇక్కడ లోటుకు కారణం కేసీఆర్ అంటూ అభియోగాలు మోపుతున్నారు ఆంధ్రా మంత్రులు. అది నిజం కాకున్నా నమ్మించే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు.
రాష్ట్రం విడిపోయాక విద్యుత్ కష్టాలు అధికంగా తెలంగాణకే ఉన్నాయి. అప్పట్లో కొన్ని రోజులు ఏపీ నుంచి విద్యుత్ తీసుకున్న రోజులు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పోయి తెలంగాణకు మిగులు విద్యుత్ వచ్చేసింది. దీంతో తెలంగాణకు కష్టకాలం అన్నది ఇప్పుడు లేదు. మరి! మన పాలకులు ఏం చేస్తున్నారని? సొంత మనుషుల వృద్ధి కోసం తెగ తాపత్రయపడే మన నేతలు ఆ పాటి దృష్టి విద్యుత్ రంగంపై నిలిపి ఉంటే ఈ పాటికి సమస్యలు అన్నవి పరిష్కారం అయి ఉండేవి.
మిగులు విద్యుత్ సాధనలో ఆంధ్రా పై తెలంగాణే గెలిచింది. జల విద్యుత్ ఉత్పత్తిలో కానీ, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కానీ ఆంధ్రాపై తెలంగాణనే పై చేయి సాధించింది. అదేవిధంగా ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో డిమాండ్ కూడా కొద్ది రోజుల పాటు తక్కువే అని ప్రధాన మీడియా చెబుతోంది. ఇవన్నీ పరిగణిస్తే ఆంధ్రా కన్నా తెలంగాణనే బెటర్ అని తేలిపోయింది. అదేవిధంగా మిగులు విద్యుత్ అమ్మకంపై కూడా తెలంగాణ ఆసక్తిగా ఉందని ప్రధాన మీడియా వెల్లడిస్తోంది. ఈ పాటి ముందు చూపు ఏపీ సీఎంకు లేకపోవడమే విడ్డూరం.