2023 నాటికి ఎన్నికలు నిర్వహించి ముందస్తు పోరులో విజేతగా నిలవాలని తహతహలాడుతున్నాడు. ఎలానూ ఖజానాలో డబ్బులు లేవు కనుక అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టంగా ఉందన్న మాట ఒకటి తన సన్నిహితుల వద్ద అంటున్నాడు. పైగా ముందస్తుకు పోతే తానేంటో తన పనితనమేంటో తెలుసుకునే అవకాశం కూడా వస్తుందని భావిస్తున్నాడు. ఈ విషయంలో తనకు కేసీఆర్ ఆదర్శం అని అంటున్నాడు. గతంలో 2018లో ఎన్నికలకు పోయి ఒక ఏడాది ముందుగానే అధికారం వదిలి సత్తా చాటాడు. అదేవిధంగా తాను కూడా ఏడాదికి ముందే ఎటువంటి పొత్తులు లేకుండానే ఎన్నికలకు పోయి విజేత కావాలని అభిలషిస్తున్నాడు. కానీ బాబు మాత్రం ఇంకా తాను సిద్ధం కాలేదు అన్న తీరులోనే పార్టీని నడుపుతున్నాడు. ఇదే సమయంలో ప్రతిపక్షాలను పూర్తిగా బలహీనం చేశాడని జగన్ పై కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా కేసీఆర్ వ్యూహం లాంటిదేనని అంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు.
వచ్చే ఎన్నికల సమరాంగణానికి సంబంధించి ఇప్పటి నుంచే వ్యూహాలు రాయడంలో చంద్రబాబుతో పోటీ పడుతున్నాడు జగన్. సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు తనదైన రాజకీయ సమీకరణాలను రాస్తున్నాడు. సొంత మీడియా సాయంతో కొన్ని కథనాలు రాయించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదే సమయంలో జగన్ కూడా వాటికి కౌంటర్లు ఇచ్చేందుకు తన రెండక్షరాల పేపర్ ను వాడుకునేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ పరీక్షలో ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా కూడా ప్రజలకు వచ్చే నష్టం ఏమీ లేదు. పార్టీల వారి వారి జీవితాలను మార్చుకునేందుకు మాత్రమే ఉపయోగపడే ఎన్నికలు ప్రజా జీవితాలను గొప్పగా ప్రభావితం చేస్తాయని అనుకోవడం ఇప్పటిదాకా జరుగుతున్న తప్పు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు తన రూటు మార్చి పవన్ ఇంటి వైపుగా వెళ్తున్నాడు. పార్టీ కోసం ప్రగతి కోసం పని చేసే వారికే ప్రాధాన్యం అంటూ స్టేట్మెంట్ ఒకటి ఇస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ జగన్ మాత్రం తన దారి తనదే అని చెబుతున్నాడు. ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నాడు. పొత్తులకు అస్సలు ఒప్పుకోవడం లేదు. సోలో ఫైటే సో బెటర్ అని చెప్పేస్తున్నాడు. గతంలోనూ ఇలానే చేసి విజయం సాధించామని, ఈ సారి కూడా ఇలానే చేద్దామని పార్టీ శ్రేణులకు ఉపదేశాలు అందిస్తున్నాడు. అంతేకాదు ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవ్వాలని మంత్రులకు సూచిస్తున్నాడు.