దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు కురవడంతో కూరగాయల సంబంధించిన పంటచేలు వరదకు కొట్టుకుపోవడం.. కొన్ని రాలిపోవడం.. ఇలా రైతులకు ఏదో రూపంలో నష్టం తెచ్చిపెట్టాయి. ఒక్కసారిగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలను చూసి సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో రవాణా చార్జీలను పెంచేస్తున్నారు. రైతులు కూరగాయల ధరలను పెంచక తప్పడం లేదు. ఒకవైపు పంట దిగుబడి తగ్డడం... మరోవైపు రవాణా ఛార్జీల మోత మోగడం లాంటివి చోటు చేసుకోవడంతో రైతులు, వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా పొలాలు మునిగిపోవడం ద్వారానే ఎక్కువగా రైతులు నష్టపోయి కూరగాయల ధరలు ఒక్కసారిగా మారిపోయాయని తెలుస్తోంది.
రోజు రోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే రెట్టింపుకు పైగా పెరిగిపోయాయి. రూ.కేజీ 30 ఉన్న పచ్చిమిర్చి ఒక్కసారిగా రెట్టింపుగా రూ.60కి చేరుకుంది. ఉల్లిగడ్డలు 100కు 5 కేజీలు ఉండేవి. ఇప్పుడు రెండు లేదా మూడు కేజీలు కూడ రావడం లేదు. దీంతో సామాన్యుడి బతుకు భారంగా మారిందని.. ఇలా ధరలు పెరిగితే ఎలా బతకాలని పేర్కొంటున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి ఎక్కువగా ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి తదితర కూరగాయలు వస్తుంటాయి. కర్నూలులో ఈసారి పంట దిగుబడి తక్కువగా ఉండడం.. అందులో వర్షాలు ముంచెత్తడంతో రైతులకు నష్టాలు వాటిల్లాయి. దీంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూరగాయల ధరలను పెంచక తప్పడం లేదు. సామాన్యులు మాత్రం కూరగాయల ధరలు ఈవిధంగా పెరిగితే ముందు ముందు పస్తులుండాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో ప్రభుతం ఉల్లిగడ్డలకు ఇచ్చిన రాయితీ ప్రకారం.. కూరగాయల ధరలను అరికట్టితే అందరూ సంతృప్తిగా భోజనం చేసి సంతోషంగా ఉంటారని పలువురు పేర్కొంటున్నారు.