పార్టీ ఆఫీసులపై దాడులు ఖండించాలనీ, బుధవారం రాష్ట్ర బంద్కు పార్టీలన్నీ సహకరించాలనీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోరిన క్రమంలో మొట్టమొదటగా జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయనీ, వైసీపీని గద్దె దించడానికి ఇరు పార్టీలు ఒకేతాటిపైకి వచ్చి నడుస్తాయని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు తెలుగుదేశం పార్టీ ఎందుకు అంతగా ప్రాధాన్యం ఇస్తుందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒకే ఒక్క సీటును జనసేన పార్టీ గెలుచుకుంది. అలాంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ అంతగా ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా? అని తెలుగు తమ్ముళ్ల వాదనగా వినిపిస్తోంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమ రాజకీయ శత్రువు వైసీపీపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న క్రమంలో ఆయనతో వైరం కంటే... స్నేహాన్ని పునరుద్ధరించుకోవడమే సమంజసమని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. పైపెచ్చు అధికార వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి దగ్గరగా జనసేనాని వాయిస్, అడుగులు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయమనీ, వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి ఖాయమనీ విశ్లేషణలు వెలువడుతున్నాయి తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ వీడియో రిలీజ్ చేయడం రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు బలం చేకూరుస్తున్నాయి.