వైసీపీ సర్కారు టీడీపీ ని పూర్తిగా టార్గెట్ చేస్తూ కొన్ని చట్ట పరమైన చర్యలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో పలువురు నాయకులపై కేసులు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతోంది. అంతేకాకుండా కొందరిని గృహ నిర్బంధంలో ఉంచి ఇవాళ బంద్ విఫలం అయ్యేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిలో సక్సెస్ అయింది. అయితే ఇదే విధంగా గతంలో తాము వ్యవహరిస్తే వైసీపీ ఏమైపోయేదని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు.
పోలీసులు అధికార పార్టీ ఏం చెబితే అదే చేసేందుకు సిద్ధం ఉన్నారన్నది టీడీపీ వాదన. ఇవాళ మా ఊరు శ్రీకాకుళంలో హౌస్ అరె స్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడిక్కడ నిరసనలు చేస్తున్న వారిని అరెస్టులు చేసి తీసుకుని పోయారు. దీంతో పలు స్టేషన్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు ఎక్కడిక్కడ ప్రతిఘటించడంతో పోలీసులకూ, టీడీపీ వర్గాలకూ మధ్య వాగ్వాదం నెలకొం ది. అయితే కొన్నిచోట్ల పోలీసుల అతి కారణంగా స్టేషన్లకు వచ్చేదే లేదని కొందరు కార్యకర్తలు మొండికేశారు. అదేవిధంగా సీనియర్ నాయకులంతా రోడ్లెక్కి ఉదయం ఆరు గంటలకే ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకుని నిరసనలు తెలిపారు. పోలీసుల అతి కారణంగా చాలా చోట్ల తీవ్ర అవమానాలకు గురయ్యారు. ఇవన్నీ ప్రజాస్వామ్య విధానాలకు సరిపోవని, తాము నిరసన చేస్తుంటే పోలీసులు అతి దౌర్జన్యంగా పట్టుకుపోవడం తగదని సీనియర్ టీడీపీ లీడర్లు ఆవేదన చెందారు. గతంలో నిరసనలు చెప్పే హక్కు ఇంతలా ఎవ్వరూ అడ్డుకోలేదని, ఆ రోజు తమ ప్రభుత్వం అనుమతే లేకుంటే జగన్ పాదయాత్ర చేసేందుకు వీలుండేదా అని ప్రశ్నించారు.