- టీడీపీ నాయకుల ఆవేదన
వైసీపీ సర్కారును ప్రశ్నించే తీరు పై టీడీపీ మరింత పదును పెంచింది. అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరు స్వరం మరింత పెంచింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఓ చర్చనీయాంశం కానుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా సాగవుతున్న గంజాయి సాగుపైనే పెద్ద ఎత్తున్న పోరాటంచేయాలని, దీని రవాణాను నియంత్రించాలని ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచాలని తద్వారా ప్రజల దృష్టి మరింత ఆకర్షించాలన్న ఆలోచన కూడా చేస్తోంది టీడీపీ. ఇదే సందర్భంలో మరిన్ని నిరసనలకు శ్రీకారం దిద్దాలని యోచిస్తోంది. ఇక ఇవాళ ఎంపీ రాము అరెస్టు సందర్భంగా ఏం జరిగిందో చూద్దాం.
టీడీపీ అధినాయకత్వం పిలుపు మేరకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు బంద్ లో పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని నిరసనలు తెలిపారు. ఇదే సందర్భంలో మీడియాతో మాట్లాడుతుండగా కొందరు పోలీసులు చేరుకుని అస్సలు ఎంపీ అన్న స్పృహ కూడా లేకుండా ఆయనను పట్టుకుపోయేందుకు తెగ ప్రయత్నం చేశారు. పోలీసులు అతి కారణంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. తాను ఒక ఎంపీ అని, ఈ ప్రాంత సమస్యలను ఢిల్లీ దాకా వినిపించేందుకు ఉన్న ఎంపీనని, తనను అరెస్టు చేసే సమయంలో కనీస ధర్మంగా అయినా వ్యవహరించలేదని అన్నారు. మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు ఆయనను లాక్కొని పోయారు. ఈ సందర్భంగా పెనుగులాట జరిగింది. అస్సలు ఓ బాధ్యతాయుత ప్రజాప్రతినిధిని ట్రీట్ చేసే విధానం ఇదేనా అని ఎంపీతో సహా పలువురు ప్రశ్నించినా ఇవేవీ పోలీసులు వినిపించుకోలేదు.