చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో వైసీపీ సర్కార్ తో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. ఆయన అసలు తగ్గడంలేదు. అందుకే ఆఘమేఘాల మీద మంగళగిరి ఆఫీస్ ని వచ్చి క్యాడర్ ని మొత్తం అలెర్ట్ చేసిన బాబు రాష్ట్ర బంద్ కి పిలుపు ఇచ్చారు. ఇక ఇపుడు ఆయన ముప్పయి ఆరు గంటల పాటు నిరాహారదీక్షకు కూర్చోబోతున్నారు.
ఇది కచ్చితంగా మైలేజ్ తెచ్చేదే అంటున్నారు. బాబు ఈ వయసులో ఆహారం ముట్టకుండా ఇలా దీక్ష చేయడం ద్వారా ఏపీ జనాలని తన వైపునకు తిప్పుకోవాలనుకుంటున్నారు. ఇక శనివారం బాబు ఢిల్లీ టూర్ కూడా పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఏపీలో పరిస్థితిని వివరించిన బాబు ఈసారి స్వయంగా ఆయన్ని కలవాలనుకుంటున్నారు.
హోం మంత్రితో భేటీ తరువాత కీలక రాజకీయ పరిణామాలే ఏపీలో చోటు చేసుకుంటాయని టీడీపీ నాయకులు అంటున్నారు. ఒక వైపు బద్వేల్ ఉప ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తోంది. దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పరోక్షంగా కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే టైమ్ లో బాబు ఢిల్లీ టూర్ అంటే కచ్చితంగా ఉభయ కుశలోపరిగానే ఈ చర్చలు ఉంటాయని అంటున్నారు. నిజానికి మూడేళ్ల నుంచి బాబు జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సడెన్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారు అంటే ఇటు ఏపీలో పొలిటికల్ గా బీపీ రేగడం ఖాయమే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.