ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సింది ప్రతిపక్షమే.. విశాఖ కేంద్రంగా సాగవుతున్న గంజాయి పై ప్రశ్నిస్తూ, దీని రవాణాను నియంత్రించాలన్న ప్రతిపాదనతో ప్రతిపక్షం గత కొద్ది రోజులుగా గొంతెత్తుతోంది. ఇదే విషయమై ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖకు చేరుకుని, స్మగ్లర్లను పట్టుకుంటున్నా ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇదే మాట ఇదే ప్రశ్నతో పాటు కొన్ని అభ్యంతర కర పదాలు ఉపయోగిస్తూ పట్టాభి మాట్లాడడంతో వైసీపీ అభిమానులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇవే ఇప్పుడు మరింత చర్చకు తావిస్తున్నాయి. ఇలాంటి చర్యల కారణంగా అధినేత మెప్పు పొందడం సులువు కావొచ్చు కానీ వైసీపీ కార్యకర్తలు తమంతట తామే పతనం కోరి తెచ్చుకుంటున్నారని టీడీపీ చెబుతోంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తో సహా నిత్యం సంచరించే, కార్యకలాపాలు నిర్వహించే రాష్ట్ర పార్టీ కార్యాలయంపై జగన్ అభిమా నులు కొందరు దాడి చేయడంను దేవాలయంపై దాడిగానే అభివర్ణిస్తున్నారు కొందరు. ఇలాంటి చర్యలు రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి అని చెబుతూ కొత్త సంస్కృతికి దారి తీసిన వైసీపీ ఇకపై చరిత్రలో మరింత చెడ్డ పేరు తెచ్చుకోనుందని టీడీపీ చెబుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా దేవాలయంపై దాడిని మాత్రం పసుపు పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి దుండగులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి, అక్కడున్న అందరినీ భయభ్రాంతులకు గురిచేయడంతో వైసీపీ పై మరింత అసహనం పెరిగేలా చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇవన్నీ అధికారం లో ఉన్న పార్టీ పరువును దిగజారుస్తాయని అంటున్నారు టీడీపీ నాయకులు. ఇవే పరిణామాలపై పూర్తిగా దృష్టి సారించి, భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వర్గాలదేనని టీడీపీ డిమాండ్ చేస్తున్నా, సంబంధిత వర్గాలు మాత్రం అస్సలు స్పందించడం లేదు. ఇప్పుడు సీన్ ఢిల్లీకి షిఫ్ట్ కానుంది. అక్కడేం జరగనుందో?