ఎక్కడ మనస్సు నిర్మలంగా, నిర్భయంగా ఉంటుందో, మనిషి తలెత్తుకుని తిరగగలుగుతాడో, ఎక్కడ మనిషి తోటి మనిషిని దోచుకోకుండా ఉంటాడో.. అక్కడ స్వేచ్ఛ స్వర్గంలో నాదేశాన్ని మేల్కొలుపు అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏనాడో ప్రార్థించారు. ప్రతీ సంవత్సరం పోలీసుల అమరవీరుల దినోత్సవం రోజు ఆయన మాటలను అందరూ స్మరించుకుంటారు. కర్తవ్యం నిర్వహించే దీక్షలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరణానికి తెచ్చుకుంటూ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు.
విధులు నిర్వహించే క్రమంలో కొందరూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ నేడు అన్ని జిల్లాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయాలకు ప్రకటనలు అందాయి.
మరోవైపు సూర్యపేట జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పోలీస్ అమరవీరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఒక ప్రకటక విడుదల చేశారు. వారి త్యాగాలు గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకోవాలని పేర్కొన్నారు. అమరుల స్పూర్తితో పోలీసులు తమ విధుల్లో పునరంకితం కావాలని సూచించారు. అమరులైన ప్రతి పోలీస్ కుటుంబాన్ని తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ప్లాగ్డే సందర్భంగా ఆన్లైన్ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్ర పోలీసులు విధినిర్వహణలో ఉన్నసమయంలో తీసిన ఫోటోలను ఈనెల 28 వరకు పోటీకి పంపాలని ప్రజలను పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. 2020 అక్టోబర్ నుంచి 2021 అక్టోబర్ 28 వరకు గల మధ్య కాలంలో తీసిన ఫోటోలు ఉండాలని సూచనలు చేశారు. ఈ ఫోటోలను forms.gle/uJj58xXGQPNjp8A కు పంపాలని కోరారు. ప్రతి క్యాటగిరిలో మూడు ఉత్తమ ఫోటోలను ఎంపికచేసి బహుమతులు అందజేయనున్నారు. రాష్ట్ర పోలీస్ సోషల్ మీడియా పేజీలలో వీటిని ప్రదర్శించనున్నట్టు డీజీపీ కార్యాలయం పేర్కొన్నది.