అయితే.. ఇంతమంది ఇన్నేళ్లు రాష్ట్రాన్ని పాలించినా.. ఇప్పటికీ.. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యలు.. పరిష్కరించిన నాధుడు లేరనేది ఇక్కడి ప్రజల ఆవేదన.. అంతేకాదు.. గత ముఖ్యమంత్రుల కంటే.. కూడా జగన్ ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తారని .. ఆశలు పెట్టుకున్నవారికి ఈ రెండున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ది కనిపించకపోవడం.. మరింతగా జగన్కు మైనస్గా మారిపోయింది. ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. గత 2019 ఎన్నికల్లో సీమ మొత్తం యాంటీ అయిపోయింది.
మొత్తం నాలుగు జిల్లాల్లో కలిపి మూడు చోట్ల మాత్రమే టీడీపీ విజయందక్కించుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు విజయం సాధించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలయ్య, ఇదే జిల్లా ఉరవ కొండలో పయ్యావుల కేశవ్ విజయం దక్కించుకున్నారు. ఈ పరిణామాలపై అప్పట్లోనే విశ్లేషణలు వచ్చాయి. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా.. కూడా తమకు ఒరిగింది ఏమీ లేదని.. ఇక్కడ ప్రజలు నిర్మొహమాటంగా చెప్పేశారు. దీని ఫలితమే.. తన సొంత జిల్లాలోనూ పార్టీని గెలిపించుకోలేక పోయిన పరిస్థితి చంద్రబాబు ఎదుర్కొన్నారు.
ఇక, జగన్పై ఎన్నో ఆశలతో ఇక్కడి ప్రజలు ఒక్కుమ్మడిగా విజయం అందించారు. అయితే.. ఇప్పటి వరకు ఇక్కడ వారు ఏం కోరుకుంటున్నారో.. ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నం కూడా జగన్ చేయడం లేదు. పైకి మాత్రం మా సీమ గురించిమాకు తెలియదా..? అని సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు చెబుతున్నా.. లోలోన మాత్రం ప్రజలు రగిలిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒక్క ఛాన్స్ ఇచ్చినా.. మాకు మార్పు రాలేదనే గొంతులు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా.. జగన్ ఇక్కడ మార్పు చేయకపోతే.. మున్ముందు పరాజయం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.