మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి.. చాన్నాళ్ల తర్వాత.. మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జగన్పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో పాలేర్ల రాజ్యం నడుస్తోందని.. అన్నారు. అంతేకాదు.. రెడ్డి వర్గానికే.. జగన్ సున్నం రాస్తున్నారని.. కేవలం కొందరు మాత్రమే ఆయన దగ్గర బంట్లు గా మారారని.. మిగిలిన వర్గాలను ఆయన పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. సీమ సమస్యలను కూడా ప్రధానంగా లేవనెత్తారు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్లో డీఎల్ ఎవరిని టార్గెట్ చేశారు.. అనే విషయాన్ని చూస్తే.. రెడ్డి సామాజిక వర్గాన్ని ఫుల్లుగా టార్గెట్ చేసుకున్నారనేది సీమలో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం జగన్ కు అంతో ఇంతో రెడ్డి వర్గం నుంచి మద్దతు ఉంది.
దీనిని ఎవరూ తప్పుబట్టరు. ఆయన రెడ్డి కాబట్టి.. రెడ్డి వర్గం ఆయనకు మద్దతుగా ఉంటుంది. కానీ.. ఇప్పుడు డీఎల్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. రెడ్డి వర్గానికి కూడా జగన్ ఏమీ చేయలేదని.. కేవలం తన కుటుంబంలోని వారికి.. తన వ్యాపార భాగస్వాములను మాత్రమే పదవుల్లో నియమించుకున్నారని.. ఇంతకు మించి రెడ్డి వర్గానికి ఏమీ చేసింది లేదని.. స్పష్టంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ కారణంగా.. క్షేత్రస్థాయిలో చక్రం తిప్పాలని అనుకున్న రెడ్డి వర్గం తీవ్రంగా మథన పడుతోంది.
ఎమ్మెల్యేలుగా ఉన్న రెడ్డి వర్గం కూడా పనులు చేయలేక చేయించలేక.. కేడర్ను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో రెడ్డి వర్గాన్ని కార్నర్ చేస్తూ.. డీఎల్ చేసిన వ్యాఖ్యల ప్రభావం వారిపై బాగానే పనిచేస్తోందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. డీఎల్ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారనేది ఇప్పుడు చర్చగా మారింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో ఉన్నారా? అంటే.. లేరనే సమాధానం వస్తోంది. అలాగని.. టీడీపీలోకి వస్తారా? వస్తే.. చంద్రబాబు ఆయనకు ఇచ్చే ప్రాధాన్యం ఏంటి.? ఇచ్చినా.. రెడ్డి వర్గానికి ఆయన వకాల్తా పుచ్చుకుంటారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
దీనిలో కనుక డీఎల్ క్లారిటీ ఇవ్వగలిగితే.. రెడ్డి వర్గం ప్రభావితమయ్యే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు తాము జగన్ పాలనలో ఆశించింది జరగలేదని ఈ వర్గం భావిస్తోంది. ఈ సమయంలో తాము ఇంకా వేచి చూసే ధోరనిలో ఉంటే ప్రయోజనం ఉంటుందా? అనేది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోఒ డీఎల్ వ్యాఖ్యలు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి.