ఇక టీఆర్ఎస్ ప్లీనరి నవంబర్ 15న వరంగల్లో విజయగర్జన సభ పేరుతో నిర్వహించనున్నారు. అన్ని రాజకీయాల్లో అలజడి మొదలయింది. ఈ హడావిడికి అధికార పార్టీలో ఏదో జరగబోతుందన్న చర్చ నడవడమే కారణం. అందుకు యాదాద్రి పునఃప్రారంభం అనంతరం ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. అందుకు ఓ వ్యూహం ఉంటుంది. ఎన్నడూ లేనిది పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు కేసీఆర్. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
అయితే, ఇదంతా తన కుమారుడిని సీఎం చేసేందుకేననే చర్చ బలంగా వినిపిస్తోంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందన చర్చ కూడా సాగుతోంది. యాదాద్రి ఆలయ వేడకను దేశమంతా తెలిసేలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నాడు. ఇదే సమయంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అదే ఇప్పుడు పొలిటికల్ పార్టీల్లో అలజడి సృష్టిస్తోంది. ఎదిగొచ్చిన కొడుక్కు మరిన్ని బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారట కేసీఆర్. కేటీఆర్కు సీఎం పగ్గాలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని భావిస్తున్నారట.
కేటీఆర్ ను సీఎం చేయాలనే ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ఇప్పుడు మాత్రం పక్కాగా ముహుర్తం ఫిక్స్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. అందుకు యాదాద్రి పునఃప్రారంభం తరువాత ముహుర్తం నిర్ణయించారట. యాదాద్రి వేడుక సమయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు హర్షిస్తారని లెక్కలు వేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.