ఇప్పటి వరకు తాను మూడు సార్లు నిరాహార దీక్ష చేశాను అంటూ చివరి రోజు దీక్షలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఆవేశంగా ప్రసంగించారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ ఉగ్రవాద దాడి చేసింది అని ఆయన పేర్కొన్నారు. డీజీపీ ఆఫీస్, సీఎం ఇల్లు, బెటాలియన్ దగ్గర్లోనే ఉన్నాయి అని అన్నారు. ఏపీ నుంచే వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది అంటూ ఆరోపించారు. హెరాయిన్ డంప్ పట్టుకున్నారు.. దీనికి ఏపీకి లింకులున్నాయి అని అన్నారు చంద్రబాబు. ఇంతటి పెద్ద ఎత్తున మత్తు మందులు సరఫరా జరుగుతోంటే ప్రభుత్వం అలెర్ట్ కావద్దా..? అని ఆయన ప్రశ్నించారు.

పార్టీ నేతలపై దాడులు జరిగితే సహించాం.. కానీ డ్రగ్స్ వల్ల పిల్లల భవిష్యత్ పాడవుతోంది అని అన్నారు. అందుకే డ్రగ్స్ పై టీడీపీ పోరాటం అని స్పష్టం చేసారు. దీనికి ప్రజల నుంచి సహకారం వచ్చింది కానీ.. ప్రభుత్వంలో చలనం లేదు అని మండిపడ్డారు. సీఎంకు భయపడి అందరూ సరెండర్ అవ్వాలా..? అని ప్రశ్నించారు. ఇంత మంది సీఎంలు వచ్చారు.. ఏ సీఎం అయినా మద్యం వ్యాపారం చేయడానికి సాహసించారా..? అని నిలదీశారు. దొంగ సారా వ్యాపారంతో డబ్బులు గుంజుతున్నారు అని ఆయన ఆరోపణలు గుప్పించారు.

మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్.. మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టారు అని అన్నారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఆడబిడ్డల తాళిబొట్లని తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. మద్యపానం నిషేధం పేరుతో రేట్లు పెంచేశారు అని ఆరోపించారు. మద్యం ధరలు పెంచితే మద్యపానం తగ్గుతుందా..? అని నిలదీశారు. పక్క రాష్ట్రానికి పోయి మద్యం తెస్తున్నారు.. శానిటైజర్లు తాగేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. మద్యం ధరలు పెరగడం వల్ల తక్కువ ధరకు లభించే గంజాయికి అలవాటు పడుతున్నారు అన్నారు చంద్రబాబు.

డ్రగ్స్.. గంజాయి గురించి ఆనందబాబు మాట్లాడితే నోటీసులిచ్చారు అని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు సీఎం జగనుకు సమీక్ష జరిపే సమయం కూడా లేదా..? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర సిఎం కేసీఆర్ సమీక్ష చేసారని అన్నారు.  మేం ఆధారాలిస్తాం.. పోలీసులు చొక్కాలిప్పేయండి.. ఆ ఇన్వేస్టిగేషన్ మేమే చేస్తాం అన్నారు ఆయన.నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి జగన్ నోట్లో వేలు పెట్టుకుని ఉండుంటాడు.. లేదా బుడ్డి పాలు తాగుతుండొచ్చు. అంటూ ఎద్దేవా చేసారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: