ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చిలకలూరిపేటలో మరీ చెప్పుకోదగ్గ అభివృద్ధి అయితే లేదనే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అయితే మితిమీరిన ప్రచారమే ఇప్పుడు ఆమె కొంప ముంచేస్తోందా ? అంటే అవుననే అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆమె కోసం సీటు త్యాగం చేసిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ ఆమె ముందే చిలకలూరిపేట బహిరంగ సభలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన కోసం త్యాగం చేసిన మర్రి ని కాదని రజనీ బీసీ కోటాలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల కేబినెట్ రేసులో రజనీ ముందు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఇప్పుడు చిలకలూరిపేట వైసీపీ కార్యకర్తల్లో మంట పెట్టేస్తోంది. సీనియర్ నేత మర్రికి మంత్రి పదవి వస్తుందని గత ఎన్నికల్లో పేట వైసీపీ కేడర్ అంతా రజనీ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడింది. ఇప్పుడు అదే మర్రిని పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేయడం వారికి నచ్చడం లేదు.
మరో వైపు నరసారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు తోనూ ఆమె కు పడడం లేదు. పైగా పేటలో రజనీ కుటుంబానికి చెందిన వారే ఎంపీ కారుపై దాడి చేయడంతో నియోజకవర్గంలో కమ్మ వర్గం వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక రజనీకి మంత్రి పదవి వస్తుందని ఎంత ప్రచారం జరిగినా కూడా గుంటూరు జిల్లాలో కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీలను దాటుకుని బీసీ గా ఉన్న ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇక దూకుడు, వివాదాలే ఆమెకు పెద్ద మైనస్ గా మారిపోయాయనే అంటున్నారు.