ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఆర్థిక మంత్రి హరీశ్రావు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు కొందరు నామినేషన్ దాఖలు చేసి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఉపఎన్నికలో మొత్తం 30 మంది ఉన్నారు. ఇందులో వివిధ పార్టీల వారితో పాటు ఇండిపెండెంట్లు ఉన్నారు.
మంత్రి హరీశ్రావు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించడమే ధ్యేయంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర పరిధిలో ఉండే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై మండిపడుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రతిచోట ప్రచారంలో భాగంగా గ్యాస్ సిలిండర్ను ముందుంచుతున్నారు. దీనిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్కు ఎన్నికల సంఘం గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. దీంతో నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ''హుజురాబాద్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్ తరపున ప్రచారం చేస్తున్న హరీశ్ రావు...!'' అంటూ కామెంట్లు చేస్తున్నారు.