నాయకుల్లో కేసీఆర్ ది ప్రత్యేక శైలి. ఆయనేం చెప్పినా విభిన్నంగా ఉంటుంది. పైకి ఆంధ్రా పాలకులను తిట్టినా, అదంతా రాజకీయం వరకే అన్నది ఎప్పుడో తేలిపోయింది. ఇప్పటికీ ఆయనకు జేసీ లాంటి నాయకులతో మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. ఆయన నడవడి విభిన్నంగా ఉంటుంది. అందరి కన్నా భిన్నంగా ఆలోచించి తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో అదే చేస్తాను అని చెబుతారు. వాటిలో కొన్ని ఫెయిల్ అయినా కూడా కేసీఆర్ చెప్పే తీరు కు మాత్రం తిరుగులేదు. తెలుగు నేలపై ఇంతటి వాగ్ధాటి ఉన్న నేత మరొకరు లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. పార్టీపై ముఖ్యంగా తెలంగాణపై మంచి పట్టున్న నేత. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చగల సమర్థుడు. తెలంగాణ కోసమే నేను అన్న విధంగా ఉద్యమంలో తిరిగినా, ప్రజల మంచి కోసమే నేను అని ఇప్పుడు చెప్పినా అదంతా కేసీఆర్ కే చెల్లు.
ఇరవై ఏళ్ల టీఆర్ఎస్ ఎన్నో ఒడిదొడుకులు దాటి ప్లీనరీ వైపు అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి హైటెక్స్ సిద్ధం అవుతోంది. కేసీఆర్ లాంటి లీడర్ కు ఇది అత్యంత చారిత్రక పరిణామం. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ కు హుజురాబాద్ ఎన్నికలు మరింత ప్రాధాన్యాంశంగా మారాయి. ఇరవై ఏళ్ల కిందట టీఆర్ఎస్ కు, ఇప్పటి టీఆర్ఎస్ కు ఎంతో తేడా! ముఖ్యంగా చాలా మార్పులు వచ్చాయి. అసలు చాలా చిన్న పార్టీగా ప్రారంభం అయి అంచెలంచెలుగా ఎదిగి తరువాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా ఇంటి పార్టీగా స్థిరపడిపోయింది తెలంగాణ వాకిట. ముందు ఉద్యమ పార్టీగా ప్రారంభం అయినప్పటికీ తరువాత పూర్తి రాజకీయ పార్టీగా ఆవిర్భవించి వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకుంది.