స్వభావ రీత్యా కేసీఆర్ భోళా మనిషి. జగన్ మొండి ఘటం. కానీ కేసీఆర్ ఆయన అనుకున్నది సాధించేదాకా నిద్ర పోరు. జగన్ కూడా అంతే కానీ పగ, ప్రతికారం లాంటి పదాలు జగన్ వినిపించిన విధంగా తెలంగాణ పెద్దాయన వినిపించకపోవడమే విశేషం.
ఇవాళ మారుమూల ప్రాంతాలలో కూడా కేసీఆర్ కు అభిమానులు ఉన్నారంటే అందుకు కారణం ఆయన నడవడే.. పాలనా తీరు కూడా ఇంకొంత కారణం కావొచ్చు. అందుకే ఆయన ఇవాళ ఆంధ్రా హీరో అయ్యారు.
తెలంగాణ ఇంటి పార్టీకి ఇవాళ ఇరవై ఏళ్లు. మంచి పాలన, సంక్షేమం అన్నవి ప్రధాన అంశాలుగా కేసీఆర్ పని చేస్తున్న తీరు బాగుంది. అదేవిధంగా దళిత బంధు పథకంతో దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాధించలేనంత కీర్తి ఆయనే దక్కించుకున్నారు. పథకం తీరు పై కూడా పూర్తి దృష్టి సారించి తనదైన పంథాలో దూసుకుపోతున్నారు. ఇప్పటిదాకా దళిత బంధు నిర్వహణలో ఎంపిక చేసిన అర్హులకు ముందు చెప్పిన విధంగానే పది లక్షల రూపాయలు డిపాజిట్ చేయించి, లబ్ధిదారులకు గైడ్ చేయాలని కలెక్టర్ కు ఆదేశించారు. అదేవిధంగా ఇంకొన్ని మంచి పథకాలు తెచ్చారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలతో పాటు ఇంకొన్ని మేలయిన పనులు చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి, మిషన్ కాకతీయకు శ్రీకారందిద్దారు. చెరువులకు పూర్వ రూపం ప్రాభవం తీసుకువచ్చేందుకు మంచి ప్రయత్నమే చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కొన్ని ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించారు.
ముఖ్యంగా ఆంధ్రా ప్రజలకు కూడా కేసీఆర్ ఆరాధ్యుడిగా మారిపోయారు. నీళ్ల విషయమై తగిన సమయంలో తగిన విధంగానే ఆయన స్పందించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ప్రాజెక్టులు తీసుకు వచ్చే విషయమై కూడా పదే పదే అడ్డం పడుతూ రాష్ట్రాల హక్కులు కేంద్రం లాక్కుంటుందనే చెప్పారు. వ్యవసాయ చట్టాలను, విద్యుత్ చట్టాలను కేసీఆర్ వ్యతిరేకించి అటు తెలంగాణలోనే కాదు ఇటు ఆంధ్రాలోనూ హీరోగా నిలిచారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీ పరిధిలో చేర్చేందుకు ఇప్పటికీ ఆయన ససేమీరా అంటున్నారు. కానీ ఆంధ్రా పాలకులు మాత్రం కేంద్రం ఏం చెబితే అది చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా కేంద్రం భజన బాగానే చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం తన పనులు తాను చేయించుకుని
కూడా బీజేపీతో తగువేసుకుంటున్నారు. అదీ లాజిక్కు అంటే!