దీంతో వచ్చే ఏడాది జరుగబోయే యూపీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియాంక వాద్రా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, యూపీలో తమ సత్తా చాటాలన్నా, కొన్ని స్థానాల్లోనైనా గెలావాలన్నా దూకుడుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉన్నా క్షణాల్లో అక్కడికి వెళ్లిపోతున్నారు. వరుస పర్యటనలతో యోగి సర్కార్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక అదే సమయంలో కొత్త కొత్త హామీలతో ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు.
గతంలోని అపజాయాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ప్రియాంక గాంధీ వ్యూహాలను మార్చింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీలో మహిళలకు 40 సీట్లు ఇస్తామని ప్రకటించింది. దీని తరువాత ఇప్పుడు కీలక హామీ ఇచ్చింది. అదే పేదలకు ఉచిత హామి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువైన వైద్యం అందిస్తామని ప్రియాంక గాంధీ కీలక హామీ ఇచ్చారు. దీంతో ఈ హామీ యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల తరువాత ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరుతో దీన్ని అమలు చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి ఆరోగ్య శ్రీ కీలకమయింది. ఈ పథకాన్ని వైఎస్ తరువాతి సీఎంలు, ఇప్పుడు తెలంగాణ సీఎం, ఆంధ్రాలో కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉచిత వైద్యం హామీతో ముందుకు వెళ్తున్నారు.