తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ ఈ రోజు కూడా కొనసాగనుంది. మరికొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారు. గతంలో కన్నా భిన్నంగా బాబు పరిస్థితి ఉందన్నది సత్యం. రెండున్నరేళ్ల తరువాత ఢిల్లీలో అడుగుపెట్టిన బాబు రాష్ట్రపతితో భేటీ తరువాత కొన్ని కీలక వ్యాఖ్యలు జగన్ పై చేశారు. ప్రభుత్వం ప్రేరేపిత ఉగ్రవాదం పాల్పడుతోందని, దీనిపై తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించమని కోరామని చెప్పారు.
ఇవన్నీ బాగున్నా ఇవాళ బాబును ఢిల్లీలో అక్కున చేర్చుకునేవారెవ్వరు? అదేవిధంగా బాబు చెప్పిన విధంగా నడిచే పార్టీలు ఎన్ని? మద్దతు ఇచ్చే పార్టీలు ఎన్ని? వచ్చే ఎన్నికలకూ బాబు బీజేపీ నామ జపం చేయాల్సిందేనన్నది వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఇదొక్కటే సిసలు ప్రత్యామ్నాయం.
గతంలో కేంద్రంలో చక్రం తిప్పి కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి రాజకీయం చేసిన చంద్రబాబుకు, ఇప్పటి ఢిల్లీ పరిణామాలేవీ అంతు చిక్కడం లేదు. తాను బీజేపీలోకి పంపిన సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లాంటి వారు పెద్దగా యాక్టివ్ గా లేకుండా పో యారు. బీజేపీతో లాబీయింగ్ నడుపుతారని ఆశించినా కూడా వారెవ్వరూ ఆ పని సరిగా చేయలేకపోయారు. బీజేపీ యాక్టివిస్టులు గానూ మారలేకపోయారు. వీరినెవ్వరినీ బీజేపీ పెద్దగా నమ్మకపోవడమే సిసలు ఇబ్బంది. ఇదే కారణంతో ఆయనను పక్కన బెడుతున్నారు. మరో విషయం ఏంటంటే ఏపీలో టీడీపీకి జగన్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత కూడా అంతగా కలిసి వచ్చేలా లేదు అని కూడా తేలిపోయింది. అయితే కొన్ని పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప రాజకీయంగా చంద్రబాబు ఎదిగేందుకు పూర్వ వైభవం అందుకునేందుకు అవకాశం లేదు.