దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు ఈటల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈటలకు జరిగిన అన్యాయం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి రేపటితో గడువు ముగియనుండడంతో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బిజీబిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, రఘనందనరావు, జితేందర్ రెడ్డి తదితరులు మకాం వేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేసే బీజేపీ నేతలను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమన్వయం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అంటోన్న కమలనాథులు. పోలింగ్ రోజు వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకత్వం నాయకులకు, పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చింది. ఎల్ల వేళలా అప్రమత్తంగా ఉంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెబుతున్నారు.
మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారానికి ఒకే రోజు సమయం ఉండడంతో ఆయా పార్టీల నేతలు ఇంటింటికీ వెళ్తు ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారం పార్టీ తరఫున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే హుజురాబాద్లోనే ఉంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు.