దేశంలో ప‌లు రాష్ట్రాల్లో అప్పుడ‌ప్పుడు క‌రెంట్ బిల్లులు వింత‌గా క‌నిపిస్తుండ‌డం అంద‌రం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కొత్త‌గా ఇన్‌కం టాక్స్ శాఖ కూడ విచిత్రం చేసింది.  ఎండ‌న‌క‌, వాన‌న‌క పొద్దంతా క‌ష్ట‌ప‌డితే కానీ రోజుకు రూ.500 వ‌ర‌కు వ‌స్తే గ‌గ‌నం. అలాంటి వ్య‌క్తికి తాజాగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు ఇచ్చింది. ఇది విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది అంద‌రికీ.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ధుర జిల్లాల‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. అత‌డు ఒక సాధార‌ణ రిక్షా కార్మికుడు. రోజు మొత్తం క‌ష్ట‌పడినా రూ.500 వ‌ర‌కు రాని ప‌రిస్థితి. అలాంటి వ్య‌క్తికి ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఏకంగా రూ.3కోట్లు చెల్లించాల‌ని నోటీసులు పంపించింది. అది చూసినా ఆ రిక్షా కార్మికుడు షాక్‌కు గుర‌య్యాడు. పోలీసుల‌కు  సైతం ఫిర్యాదు చేశాడు ఆ వ్య‌క్తి. బ్యాంకు అధికారులు పాన్‌కార్డును అకౌంట్‌కు అనుసంధానించాల‌ని చెప్ప‌డంతో బ‌క‌ల్‌పూల్‌లోని జ‌గ‌న్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేశాడు. కొద్ది రోజుల త‌ర్వాత పాన్‌కార్డు క‌ల‌ర్ జిరాక్స్ ను జ‌న్‌సువిధ కేంద్రంలో అంద‌జేశాడు. ఆ త‌రువాత  ఐటీ అధికారుల నుంచి ఆ రిక్షా కార్మికునికి ఫోన్ వ‌చ్చింది.  సుమారుగా రూ.3,47,54,896 చెల్లించాల‌ని నోటీసులు కూడ పంపారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు వ్య‌క్తి ఐటీ అధికారుల‌కు వివ‌రించాడు.

ఇదివ‌ర‌కు ఎవ‌రో అత‌ని పాన్‌కార్డును వినియోగించుకుని వ్యాపారం చేప‌ట్టిన‌ట్టు వెల్ల‌డి అయింది. 2018-19లో జ‌రిగిన టర్నోవ‌ర్ రూ.43,44,36,201అని అధికారులు తేల్చేసారు. ఆ రిక్షా కార్మికుడు నిర‌క్ష‌రాస్యుడు. ఒరిజిన‌ల్ పాన్‌కార్డుకు, క‌ల‌ర్ జీరాక్స్ తేడా కూడ తెలుసుకోలేక‌పోయాడు. దీంతో మోసానికి గుర‌య్యాడు. అస‌లు విష‌యం తెలుసుకున్న ఐటీ అధికారులు ఆ రిక్షా కార్మికుని పాన్‌కార్డు దుర్వినియోగం అయింద‌ని గ్ర‌హించారు. పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌మ‌ని చెప్పారు. దీంతో మ‌ధుర పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు ఆ కార్మికుడు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఆ కార్మికునికి న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు పోలీసులు.  ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.



మరింత సమాచారం తెలుసుకోండి: