ఇక ఇదిలా ఉంటె హైదరాబాద్ లో రాచకొండ కమీషనరేట్ పరిధిలో బెట్టింగ్ ను బయటపెట్టారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసారు అధికారులు. 20/20 క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్, రామాంజనేయులు, రాము గౌడ్, ఛత్రపతి, కళ్యాణ్ ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు.. రిమాండ్ కి తరలించారు. క్రికెట్ లైన్ గురు, క్రికెట్ ఎక్స్ ఛేంజ్ అనే యాప్ ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ లకు ఎవరిని నుంచి సహకారం అందుతుంది అనే దాని మీద ఫోకస్ చేసారు.
క్రికెట్ మ్యాచ్ ల స్కోర్ అప్ డేట్స్ చూపించే యాప్ ల సమాచారం ఆధారంగా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు అని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ ల కోసం వివిధ రకాల యాప్ లను ఉపయోగించుకుంటున్న ముఠా సభ్యులను విచారిస్తున్నామని అన్నారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ లకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాలి అని కోరారు. 14 లక్షల 92 వేల నగదు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా బెట్టింగ్ విషయంలో మహేష్ చాలా సీరియస్ గా ఉన్నారు.