బద్వేల్ బీజేపీ అభ్యర్థి పనతల సురేష్తో కలిసి ఆయనకు మద్దతుగా టీడీపీ బద్వేల్ నియోజకవర్గ నాయకుడు కర్ణాటి వెంకటరెడ్డి ప్రచారం చేస్తున్నారు. వెంకట రెడ్డి స్వగ్రామం కాశినాయన మండలం నరసాపురం. ఆయన తండ్రి శివారెడ్డి గతంలో ఎంపీపీ గా పని చేశారు. ఇక వెంకటరెడ్డి భార్య కర్ణాటి శ్వేతారెడ్డి ప్రస్తుతం కడప పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు.
ఓ వైపు భార్య టీడీపీ లో కీలకమైన పదవిలో ఉన్నారు. ఇప్పుడు భర్త ఏకంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం గతంలో జిల్లా మంత్రిగా పని చేసిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆదినారాయణ వేసిన ఎరకు టీడీపీ నాయకుడు కర్ణాటి వెంకటరెడ్డి చిక్కినట్టు స్థానికంగా టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్క డ బీజేపీకి ఏజెంట్లు కూడా లేకపోవడంతో ఆదినారాయణ ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఇతర పార్టీల వాళ్లను లాగేసుకుంటున్నారు.
ఆ తాయిలాలు ముట్టడంతోనే వెంకట రెడ్డి బీజేపీ అభ్యర్థి సురేష్ వెంట ప్రచారం నిర్వహిస్తున్నారని స్థానికంగా గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే భార్య శ్వేతా రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఏం చేస్తుందో ? చూడాలి.