ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉపాధి అవకాశాలు తగ్గుతాయని అన్నారు. జగన్ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతుందని హెచ్చరించారు. మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. తుగ్లక్ 3.0.. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అనీ.. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని దుయ్యబట్టారు. ఇల్లు ఇక్కడే కట్టా.. అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. మూడు రాజధానులు చేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలెట్ అని విమర్శించారు. మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచన రావడం ఎప్పటికీ జరగని పని లోకేశ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

ఇక బీజేపీ కూడా మూడు రాజధానుల అంశంపై స్పందించింది. మూడు రాజధానులకు సంబంధించి కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. అధికార వికేంద్రీకరణ వారి సొత్తు కాదనీ.. రోడ్డులో గోతులు పూడ్చలేని వారు వికేంద్రీకరణ అంటున్నారని విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని గతంలో చెప్పిన మాటకు జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. రాజధానులపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ప్రజాభిప్రాయం సేకరించాలని ఆయన అన్నారు.

టీడీపీ, బీజేపీల వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.  అమరావతి సహా రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమానంగా తమ ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ కొందరు మూడు రాజధానులపై కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకున్నారనీ.. దీంతో రోడ్లు, మౌలిక వసతుల కల్పన చేయలేకపోయామన్నరు. అమరావతి రైతులకు పరిహారం, ప్లాట్లు ఇస్తున్నామనీ.. గత ప్రభుత్వంలో కరకట్ట రోడ్డును కూడా టీడీపీ నేతలు వేయలేదని బొత్స విమర్శించారు.











మరింత సమాచారం తెలుసుకోండి: