కానీ ఇప్పుడు కొందరికే !
ఉమ్మడి రాజధానిలో ఆస్తుల వాటా
ఏమయిందో జగన్ చెప్పలేరు
చంద్రబాబు కూడా చెప్పరు?
ఎందుకంటే అదంతే!
ఉమ్మడి రాష్ట్రంలో అంతా వెనుకబాటు తరువాత కూడా వెనుకబాటే! అందుకని వెనుకబాటు అన్నది లేకుండా ఉండాలన్న యాతనలో భాగంగానే విభజన చట్టంలో కొన్ని విషయాలు చేర్చారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు అయిన సీమకూ ఉత్తరాంధ్రకూ ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని తపించారు. అదేవిధంగా బీజేపీ కొంత సాయం కూడా చేసింది. ఇదే సందర్భంలో వెనుకబాటు కారణంగా ఆర్థిక లేమి కారణంగా అవశేషాంధ్ర మరింత ప్రగతి అన్నది దిగజారిపోకూడదని కేంద్రం ఆ వేళ బిల్లు రూపకల్పన (యూపీఏ చేసిందే ఇది) లో ఇంకొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా చాలా మంది హైద్రాబాద్ ను యూటీ (కేంద్ర పాలిత ప్రాంతం) చేయాలని కోరినా అదేమీ వద్దు ఉమ్మడి రాజధానిగా ఈ ప్రాంతాన్ని కొంత కాలం సాగనిద్దాం అన్న ప్రతిపాదన ఒకటి తెరపైకి వస్తే కొందరు నేతలు వ్యతిరేకించినా ఆఖరికి సమ్మతించారు. ఆ విధంగా ఇప్పటికీ మనకు హైద్రాబాద్ అన్నది ఉమ్మడి రాజధానే! కానీ ఈ ఊసు లేకుండా ఉమ్మడి ఆస్తుల పంపకం ఏడున్నరేళ్లు అయినా చేపట్టకుండా, ఇప్పటికీ అక్కడి నుంచి అంటే తెలంగాణ నుంచి రావాల్సిన ఆరువేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు చెల్లించేలా చొరవ తీసుకోకుండా, అసలు అడగకుండా మన పాలకులు ఏం చేస్తున్నారని?
రాష్ట్ర రాజధాని ఏమన్నది ఇప్పటికీ తేలలేదు. ఉమ్మడి రాజధాని సంగతి కూడా మరిచిపోయారు. అయినా కూడా ఎవ్వరూ దీనిపై మాట్లాడరు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ను ఉంచాలన్న నిర్ణయాన్ని ఏ విధంగా మరిచిపోయారు.. ఎందుకని మరిచిపోయారు.. మరుపా లేదా నిజంగానే తమకు ఏమీ తెలియదు అన్నవిధంగా ప్రవర్తిస్తున్నారా?
ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక కొత్త రాజధాని నిర్మించుకునే వెసులుబాటు వచ్చేంత వరకూ నిర్మించుకుని పూర్తి స్థాయిలో కార్య నిర్వాహక పనులు, శాసన సంబంధ పనులు చేపట్టే వరకూ హాయిగా హైద్రాబాద్ లోనే ఉమ్మడి రాజధానిని కొనసాగించవచ్చు. దురదృష్టం ఓటుకు నోటు కేసు కారణంగా అక్కడి నుంచి వచ్చేశారు. అంతేకాదు ఆ రోజు ఏపీ రాజధాని నిర్మాణం కోసం హైద్రాబాద్ సచివాలయంలో హుండీ కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు. అదేవిధంగా ఇంకా ఏవేవో దారుల్లో రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విన్నవిస్తూ నిధుల సేకరణకు పూనుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు అవేవీ ఎవ్వరికీ గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం. ఇప్పుడు అవేవీ అస్సలు పట్టింపునకు నోచుకోకపోవడం విడ్డూరం.