ఏపీలో రాజధాని అంశంపై ఇంకా రాజకీయం నడుస్తూనే ఉంది...ఈ రాజధాని అంశం ఇప్పటిలో తేలేలా లేదు. ఒక వైపు రాష్ట్రం విడిపోయాక అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళుతుంది. హైదరాబాద్ రాజధానిగా ఉండటంతో ఆ రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుంది. కానీ ఏపీకి రాజధాని లేకపోవడంతో వెనుకబడిపోయింది. అసలు రాష్ట్రం విడిపోయాక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ సైతం అంగీకరించారు. అయితే చంద్రబాబు రాజధాని అమరావతిని ప్రజల కంటే..రాజకీయంగా తమకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతోనే ప్రకటించారని విమర్శలు వచ్చాయి. అలాగే ఆ పార్టీ నాయకులు అమరావతి పేరుతో ఆర్ధికంగా బలపడ్డారని ఆరోపణలు వచ్చాయి.

సరే ఏం జరిగినా రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చిందని అనుకున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ బ్రాండ్‌గా ఉన్న అమరావతిని సైడ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానులని తీసుకొచ్చారు. పేరుకు మూడు ప్రాంతాల అభివృద్ధి అన్నారు గానీ, రాజకీయంగా మూడు ప్రాంతాల్లో తిరుగులేని పొజిషన్‌లో ఉండాలనే జగన్..ఈ మూడు రాజధానులని తీసుకొచ్చారనే విమర్శలు వచ్చాయి.

అలాగే రాజకీయంగా టీడీపీని దెబ్బతీయడానికి ప్లాన్ వేశారని విశ్లేషణలు వచ్చాయి. ఇక రాజధాని పేరుతో విశాఖపట్నంలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కాదని ఆరోపణలు వచ్చాయి. సరే ఆరోపణలు వస్తే వచ్చాయి...మూడు రాజధానుల పేరుతో....మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావించారు. కానీ రెండేళ్లలో పావలా ఉపయోగం లేకుండా పోయింది.

పైగా ఇప్పుడు మూడు రాజధానులని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మళ్ళీ కొత్త బిల్లు తెస్తామని అంటుంది. ఆ బిల్లు ఎప్పుడు వస్తుంది? ఆ బిల్లులో ఏం ఉంటుంది? అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇక అప్పటివరకు ఏపీకి రాజధాని ఏది అంటే ఏపీ ప్రజలు ఏం సమాధానం చెప్పుకోవాలి. ఏదేమైనా పార్టీలు రాజధాని పేరుతో రాజకీయం చేస్తూ...వారు బాగుపడుతూ...ప్రజలని ముంచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: