తెలంగాణ రాష్ట్ర సాధనకు దళిత బహుజనులు, సబ్బండ వర్గాలు చేసిన త్యాగాలకు బలిదానాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని, సామాజిక వర్గాలను పక్కనపెట్టి నామమాత్రంగా ఉన్న వర్గాలకు ఏనాడు తెలంగాణ కోసం పని చేయని వారికి కౌన్సిల్ లో సభ్యత్వం ఇవ్వడం ప్రజల దృష్టిలో ఇవ్వాళ వివాదాస్పదంగా మారింది. తెలంగాణ సెంటిమెంట్ తోనే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నది . కానీ తెలంగాణ ఆకాంక్షలు వీసమెత్తు కూడా అమలు కావడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సామాజికన్యాయం అంతో ఇంతో అనుభవించామని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయo 100% వాస్తవం కాదా..? అర్హతలు త్యాగాలు లేనటువంటి వారికి అవకాశం ఇవ్వడం, వివాదాస్పదులను నామినేట్ చేయడం, సామాజిక న్యాయాన్ని పాటించకపోవడం, రెడ్డి వెలమ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం, దళిత బహుజనులు మైనార్టీలను జెండాలు మోసే వారిగానే అవమానించడాన్ని బట్టి ఆత్మగౌరవం కోసం మరొక్కమారు పోరాటం రావాల్సిన అవసరం ఉందని సోమన్న ఇచ్చిన పిలుపును దళిత బహుజనులు, మైనార్టీలు, అట్టడుగు వర్గాలు ఆలోచించుకొని ఉమ్మడి పోరాట కార్యక్రమానికి సిద్ధ పడాల్సిన అవసరం ఉందని ప్రజలు గ్రహించాలి.
కలెక్టర్ గా ఉన్నప్పుడు, రాజీనామా చేసిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శాసనసభ్యునిగా ఏ రకంగా అర్హుడు న్యాయ స్థానం తేల్చనుంది. తెరాస పార్టీ ప్రభుత్వ పెద్దలు అంతకుముందే పునరాలోచన చేసుకొని చేసిన తప్పులను సవరించుకుoటే మంచిదని, సామాజిక న్యాయాన్ని ఇకముందు పాటించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని దళిత బహుజనులు మైనారిటీలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సంగతి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి.