భారతదేశంలో ఏ మూలన చూసినా అనేక కళల సమ్మేళనం కనిపించక మానదు. అలాంటి దేశంలో కళ కు సంబంధిత ఏ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ దానికి గౌరవం ఇనుమడింపజేసినట్టే అవుతుంది. అయితే ఒకేసారి భారీగా ఖర్చుపెట్టినంత మాత్రాన కళలను గౌరవించినట్టు కాదు, అవసరం బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా వ్యవస్థలను ఏర్పాటు చేయడం అక్కడ ఉన్న వారికి అలాగే వాటిని ఆస్వాదించే ప్రేక్షకులకు మేలు చేసే విషయం. కానీ అంతా ఒక్క చోటే పెట్టేసి, అక్కడే అందరు వచ్చి వారివారి ప్రదర్శనలు ఇచ్చుకోండి అనేట్టుగా ఏర్పాట్లు ఉంటె అది అభివృద్ధిని ఒక్క చోట కేంద్రీకరించినట్టు అవుతుంది. అక్కడకు ఆయా వర్గాలు వస్తారు, కళలను ప్రదర్శించుకుంటూ పొట్టపోసుకుంటారు, అంతవరకు బాగానే ఉంటుంది. మరి అక్కడకు వారందరు సొంత ప్రాంతాలను వదిలేసి వచ్చి ఉండాల్సి రావడం అనే విషయం గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది విశ్లేషకుల మాట.
తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ 1000ఎకరాలలో 2400కోట్లతో నోయిడాలో ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అంత భారీ ప్రాజెక్ట్ చేయడం అక్కడ అవసరమేనా అనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రస్తుతం అక్కడ చాలా సమస్యలు ఉండొచ్చు, వాటిపై మనసు కేంద్రీకరించి ఆయా పరిష్కారాలు చేసి ఉంటె బాగుండేది. ప్రస్తుతం ఈ ఫిలిం సిటీ తెలంగాణాలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ కంటే భారీగా చేయాలన్నది వాళ్ళ ఆలోచన అట. అసలు మొదలు పెట్టినప్పుడు రామోజీ ఫిలిం సిటీ కే అంత ఆదరణ లేదు. మరి దీనికి ఎంత ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. 2024కల్లా ఇది అందుబాటులోకి వస్తుందట. కళాకారులకు మేలు జరిగితే అంతే చాలు.