దీనివలన అక్కడ ప్రజలు నెమ్మదిగా స్థిరపడి పోతూ, ఉన్న చెరువులు ఒకవేళ ఎక్కువ వర్షపాతం పడితే అక్కడ నుండి ఆ నీరు ఎటు వెళ్లాలో మార్గం లేక, సరాసరి పేదల ఇళ్లను ముంచేస్తున్నాయి. ఇలాంటి ఇళ్లు ఇచ్చే ముందు ఎంతో ఉన్నత అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి ఆయా ప్రాంతాలలో కేటాయింపులు చేయాలా వద్దా అని ఆలోచిస్తారు కదా. అంటే అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నారని ఇక్కడ అర్ధం చేసుకోవాలా లేక వాళ్లపై అలా ఒత్తిళ్లు వచ్చాయని అర్ధం చేసుకోవాల్సి వస్తుందా! ఏది ఏమైనా నేడు బాధితులు మళ్ళీ అదే పేదవాడు. ఉన్నదానితో ఏదో ఏర్పాటు చేసుకొని బ్రతుకు నెట్టుకొస్తుంటే, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళ స్థితిని మళ్ళీ మొదటికే తెస్తున్నాయి. మరి ఇప్పుడు గతంలో ఇచ్చిన పధకాలు అన్నీ నిర్వీర్యం అయినట్టేకదా. మళ్ళీ ప్రారంభించాల్సి వస్తుంది.
ఇలా కాకుండా అధికారులు పేదలకు ఇళ్లు ఇచ్చేముందు ఆయా ప్రాంతాలలో వచ్చే ప్రమాదాలను ఊహించి, దానికి తగిన విధంగా ఎక్కడ ఇళ్లను కేటాయిస్తే బాగుంటుందో ఆలోచించి, నేతలకు అది చెపితే బాగుంటుంది. నిజానికి అధికారులు చెప్పిన చోట నేతలు ఇళ్లు కేటాయించలేకపోవచ్చు కూడా. అందుకు మళ్ళీ స్వలాభం అనే అంశం తెరపైకి రాకతప్పదు. ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం ఒకవైపు, గతంలో కేటాయించిన పధకాల నిర్వీర్యం వలన అది కూడా నష్టమే అవుతుంది. ఇలా రెండింటా చెడేకంటే, అధికారులు చెప్పిన విధంగా ఇళ్లను కేటాయిస్తే బాగుంటుంది. ఒక్కోసారి అధికారి కూడా తప్పు కావచ్చు, అందుకే ఇలాంటి విషయంలో అధికారిని సరిగ్గా నియమించుకోవడం నేతల బాధ్యత. అప్పుడు ఇలాంటి రెండింతల నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుతం కూడా ఆయా చెరువులకు సరైన దారిని భూమి కిందనుండైనా ఏర్పాటు చేసి, ఆ నీటిని వేరే కరువు ప్రాంతాలలోకి వెళ్లేట్టుగా మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, నీటిని వాడుకున్నట్టుగా ఉంటుంది, జలవిలయాలు అనే ప్రమాదం లేకుండానూ ఉంటుంది. దీనికి అందరు కలిసి పనిచేయాల్సి వస్తుంది. అది కుదిరితే, ఇప్పుడు ఇది మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదేమో! అయినా ప్రయత్నించండి, పోయేదేముంటుంది, మహా అయితే సమస్య తీరుతుంది.