పంజాబ్ జనాభాలో 32 శాతం దళితులు ఉన్నా.. ఇప్పటి వరకు ఒక్క దళితుడు కూడా సీఎం కుర్చీపై కూర్చోలేదు. ఇప్పుడు తొలిసారిగా చరణ్జిత్ సింగ్ చన్నీ రూపంలో దళిత సీఎం వచ్చారు. ఎన్నికలు వచ్చేలోపు తన మార్క్ పాలనను అందించి దళిత ఓట్లను సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. అదే సమయంలో దళిత సీఎం కొనసాగుతాడంటూ ఎన్నికల వేళ ప్రకటించేందుకు హస్తం పార్టీ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పీసీసీ చీఫ్ సిద్దూ లాంటి వాళ్లు సీఎం కుర్చీ కోసం కొత్త చిక్కులు తెచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
అయితే, దళిత ఓటు బ్యాంకు తమ వెంట ఉంటుందని, దానికి తోడు బీజేపీ, అకాళీదళ్ వేరుపడినందు వల్ల మరోసారి తమకే అవకాశం దక్కుతుందని విశ్వసిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. బీఎస్పీ, ఆప్ పార్టీలు కూడా కాంగ్రెస్కు గట్టిపోటీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేశాడు. దీంతో ఆప్ పుంజకుని ప్రధాన పార్టీలకు ప్రత్యర్థిగా అవతరిస్తోంది. మరోవైపు రైతు సంఘాల మద్ధతుతో బరిలో దిగుతామని చెబుతున్న భారతీయ ఆర్థిక పార్టీ ఇప్పటికే భారతీయ కిసాన్ యూనియన్ అండదండలు పొందుతోంది. ఇదే జరిగితే ఈ పార్టీ బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్ని కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టిపోటీ ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.