ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాలకు స్థానిక సంస్థల కోటాలోని 12 స్థానాల్లో ఆశలు పెట్టుకున్న చాలామంది వాటిలో తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే, కనీసం ఇప్పుడు ఖాళీ కాబోతున్న రాజ్యసభ పదవిని అయినా దక్కించుకునేందుకు నేతలు తమ శక్తి యుక్తులను ప్రయోగిస్తున్నారు. పార్టీకి ఎన్నో ఏళ్లుగా విధియులుగా ఉన్న వారికి అవకాశం లభిస్తుందా లేదా ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఇందులో కేసీఆర్ దగ్గరి బంధువు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్, కేసీఆర్ ఆత్మీయ స్నేహితుడు తుమ్మల నాగేశ్వర రావు, మాజీ మంత్రి వెంకటేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు గులాబీ అధినేత మెప్పుకోసం ప్రయత్నాలు జరుపుతున్నారు.
ఇక వీరితో పాటు ఇటీవల ఎమ్మెల్సీ రెన్యూవల్ దక్కని కర్నెప్రభాకర్, ఆకుల లలిత, బీ. వెంకటేశ్వర రావు, నేతి విద్యాసాగర్ రావు, గాయకుడు సాయిచంద్ తదితర నేతలు కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, రాజ్యసభ పదవి కోసం ఎంపికలో కేటీఆర్ ముద్ర కూడా ఉండనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి సీఎం కేసీఆర్ ఎవరికి వరం ఇస్తాడో వేచి చూడాలి.