ఇందులో మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పోలిస్తే ఎంపీటీసీ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే తొలిసారిగా ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎన్నికలు జరిగే జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఓటు హక్కు కల్పించింది. దీంతో ఓటు వేయనున్న 65 మంది ఎక్ష్ అఫిషియో సభ్యుల్లోనూ మెజారిటీ సభ్యులు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు.
దీంతో అన్ని స్థానాల్లోనూ గెలవడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రతి ఓటును కీలకంగా భావిస్తోన్న టీఆర్ఎస్.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఖమ్మం, మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థులు, కరీంనగర్-ఆదిలాబాద్లో బీజేపీ ముఖ్యంగా ఈటల పరోక్షంగా బలపరుస్తున్న అభ్యర్థులు ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రెండు స్థానాలు ఉన్న కరీంనగర్లో అత్యధికంగా 1324 ఓటర్లు ఉండడంతో పాటు ఒకరిద్ధరు బలమైన స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో తమ పార్టీ తరఫున ఎన్నికయిన ఓటర్లు చేయి దాటకుండా చర్యలు తీసుకుంటోంది టీఆర్ఎస్.
మరోవైపు విపక్షాలు కూడా టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తోంది. అయితే, విపక్ష పార్టీల నుంచి గెలిచిన చాలామంది నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎంపీటీసీల మద్ధతు కూడగట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా ఎవరికి వారు సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు.