తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన విడుద‌ల చేసింది. టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానమిచ్చారు. దేశ వ్యాప్తంగా 2021-22 ఖరీఫ్‌లో వరి ధాన్యం సేకరణ టార్గెట్ 521.89 లక్షల మెట్రిక్ టన్నులుగా కేంద్రం పేర్కొంది. రబీ (యాసంగి) సీజన్ మొదలయ్యాక రబీ టార్గెట్ నిర్ణయిస్తామ‌ని స్ప‌ష్ట‌తనిచ్చింది. 2020-21 రబీలో మొత్తం 55 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ పెట్టుకోగా, 61.87 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రాల నుంచి సేకరించామ‌ని వివ‌రించింది.


మిగులు బియ్యాన్ని రాష్ట్రాలు తీసుకోవాల్సిందిగా కోరడంతో టార్గెట్ మించి తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సిందిగా ఆగస్ట్ 17న రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో నిర్ణయించిన్న‌ట్టు పేర్కొన్నారు. పెరిగిన దిగుబడి అంచనాలు, మార్కెట్లో మిగులు, పెరిగిన సాగును దృష్టిలో పెట్టుకుని సేకరణ మరింత పెంచాలని చూస్తున్నామ‌న్నారు. అంటే 40 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేక‌ర‌ణ‌కే ప‌రిమితం కాకుండా .. ఎంత పెంచాలన్నది దిగుబడి అంచనాలు, మార్కెట్ మిగులు, సాగు తీరు గణాంకాల ఆధారణంగా నిర్ణయిస్తాం అని పేర్కొన్నారు.


 అయితే,  ధాన్యం ఉత్ప‌త్తి అంచ‌నాలు, మార్కెట్ మిగులు గురించి రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశ‌మ‌ని..  కానీ దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌మాధానం రాలేద‌ని కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పేర్కొన్నారు. దానికంటే ముందు ఆంధ్ర‌ప్రేదేశ్ టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ధాన్యం సెక‌ర‌ణకు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడిగారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంత ధాన్యం సేక‌ర‌ణ చేస్తున్నార‌ని అడిగారు. అయితే, ఆంధ్ర ప్ర‌దేశ్ కంటే తెలంగాణ‌లోనే ధాన్యం సేక‌ర‌ణ ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని కేంద్ర మంత్రి లిఖిత పూర్వ‌కంగా రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: