మన దేశంలో భాషాభిమానం ఉన్న రాష్ట్రం ఏదీ అంటే.. అంతా ఠక్కున చెప్పే పేరు తమిళనాడు. ఇంకా చెప్పాలంటే.. భాషకు పట్టం కట్టారు తమిళ తంబిలు. తమ గురించి తప్పుగా మాట్లాడినా భరిస్తారు కానీ... భాషను తక్కువ చేస్తే మాత్రం... అంతా ఏకమై పోతారు. తమిళ సంప్రదాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు తమిళులు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహించే జల్లికట్టును హింసాత్మక క్రీడ అంటూ కేంద్రం అభివర్ణించింది. దీనిని నిర్వహించవద్దు అంటూ హుకుం జారీ చేసింది. ఇక అంతే... చిన్నా పెద్దా అంతా ఏకమయ్యారు. పార్టీలకు అతీతంగా ధర్నాలు చేశారు. తాము అనుకున్నది సాధించారు. ఇప్పుడు నీటి పరీక్షపై కూడా ఇదే విధానం కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షను రాయాల్సిన అవసరం లేదంటున్నారు కూడా. ఇక ప్రైవేటు సంస్థలపై అయితే... ఓ రేంజ్‌లో యుద్ధమే చేశారు. తమిళంలో మాట్లాడిన వినియోగదారుడితో... మీరు జాతీయ భాష హిందీ నేర్చుకోవాలంటూ జొమాటో ఏజెంట్ వ్యాఖ్యానించాడు. ఇక అంతే... ఏకంగా జొమాటో సంస్థకే షాక్ ఇచ్చారు తమిళులు. బ్యాన్ జొమాటో అంటూ పిలుపునిచ్చారు. అసలు హిందీ జాతీయ భాష కానే కాదంటూ నినాదాలు చేశారు. దీంతో దిగివచ్చిన జొమాటో... సారీ చెప్పేసింది కూడా.

తమ భాషను ఎవరైనా చిన్నచూపు చూస్తే మాత్రం... తమిళులు ఏ మాత్రం క్షమించరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమిళంలోనే  ప్రభుత్వ కార్యాలయాల పేర్లు, ఉర్ల పేర్లు ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు తమిళంలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్. తమిళనాడు రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలంటే మాత్రం... ఖచ్చితంగా వాళ్లు తమిళం పరీక్ష పాస్ అవ్వాల్సిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేశానికి తప్పనిసరిగా తమిళ పరీక్షకు అర్హత సాధించాలని నియమం పెట్టేసింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించే తమిళ పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించడం తప్పని సరి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పళినివేల్ త్యాగరాజన్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: